Telugu Gateway
Politics

లాక్ డౌన్ ఎప్పుడు తొలగిస్తారో మోడీ చెప్పాలి

లాక్ డౌన్ ఎప్పుడు తొలగిస్తారో మోడీ చెప్పాలి
X

దేశంలో కరోనా కేసుల జోరు తగ్గకపోవటంతో కేంద్రం ఎప్పటికప్పుడు లాక్ డౌన్ పొడిగిస్తూ పోతోంది. మే 3 తర్వాత లాక్ డౌన్ ఎత్తేస్తారని చాలా మంది భావించారు. పలు రంగాలకు చెందిన నిపుణులు కూడా లాక్ డౌన్ ను అలా కొనసాగిస్తూ పోవటం ఏ మాత్రం మంచిదని కాదని హితవు పలికారు. అయితే కేంద్రం మాత్రం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో చాలా వరకూ మినహాయింపులు ఇఛ్చినా లాక్ డౌన్ ఎత్తేయటంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి అయితే మే 17 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్రమోడీ నుంచి క్లారిటీ కోరింది. ప్రధాని మోడీ జాతినుద్దేశించి మాట్లాడాలని లాక్ డౌన్ ఎప్పుడు తొలగిస్తారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా కోరారు.

ఆయన శనివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ఓ వైపు కరోనా, మరో వైపు లాక్ డౌన్ తో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. లాక్ డౌన్ ఉపసంహరణ వ్యూహాలను రూపొందించాలన్నారు. కరోనా, ఆర్ధిక రంగం నిర్వహణపై నిర్ణయాలను తెలపాలని కోరారు. వలస కార్మికుల విషయంలో కేంద్రం మానవత్వంతో వ్యవహరించటం లేదని విమర్శించారు. శానిటైజ్ చేసిన రైళ్లలో వారిని ఉచితంగా తీసుకెళ్ళాలని డిమాండ్ చేశారు.

Next Story
Share it