Telugu Gateway
Andhra Pradesh

ఇకనైనా బాధ్యతగా పనిచేయండి

ఇకనైనా బాధ్యతగా పనిచేయండి
X

ఏడాది వైసీపీ పాలనపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ఇప్పటికే మహానాడులో అధికారపక్షంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఆయన తాజాగా ట్విట్టర్ లో పలు అంశాలను ప్రస్తావించారు. హామీల అమలులో వైసీపీ సర్కారు ఘోరంగా విఫలమైందన్నారు. నడిరోడ్డు మీద గోడకట్టి ప్రజాస్వామ్యన్ని అపహస్యం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే పాలకులు అరాచకాలు మొదలు పెట్టారని ఆరోపించారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టిన విధ్వంసాన్ని ఏడాది మొత్తం యథేచ్ఛగా సాగించారని పేర్కొన్నారు. ‘‘వైసీపీ పాలనకు ఏడాది పూర్తయ్యింది. కొత్త ప్రభుత్వం, అనుభవం లేని ముఖ్యమంత్రి కాబట్టి ఆరు నెలల వరకు ప్రభుత్వానికి సహకరించాలని అనుకున్నాం. ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టిన విధ్వంసాన్ని ఏడాది మొత్తం యథేచ్ఛగా సాగించారు. సమాజానికి చెడు చేసే చర్యలను, ప్రజా వ్యతిరేక పాలనను తెలుగుదేశం సహించదు.

అలాగే ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలం అయ్యారు. అవివేక నిర్ణయాలతో నమ్మిన ప్రజలనే నట్టేట ముంచారు. రైతులు, పేదలు, మహిళలు, రైతు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, యువత... ఇలా అన్నివర్గాల ప్రజలను రోడ్డెక్కించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది కుటుంబాలు 164 రోజులుగా అమరావతి పరిరక్షణ కోసం చేస్తున్న ఆందోళనలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇటు న్యాయం కోసం అమరావతి ప్రజలు, అటు విశాఖలో విష వాయు బాధితులు, మరోవైపు కరోనాతో కర్నూలు వాసులు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు లేక రైతులు, ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులు, పెట్టుబడులు వెనక్కి పోయి ఉద్యోగాలు లేని యువత... ఇన్ని విషాదాల్లో వైసిపి ఏడాది పాలన ఉత్సవాలా..? ఏం సాధించారని...? ఎవరికేం ఒరగబెట్టారని..? ఇకనైనా బాధ్యతగా పనిచేయండి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story
Share it