పేదలకు మంచి చేస్తే కోర్టులకెళతారా?
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని తెలిపారు. జూలై 8న 25లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విధానపరమైన నిర్ణయాలతోనే కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చారని స్పష్టం చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కంటే ముందే టీడీపీ నేతలు కోర్టుకు ఎందుకెళ్లారని ప్రశ్నించారు. టీడీపీకి వ్యక్తుల ప్రయోజనాలే ముఖ్యం కానీ వ్యవస్థలు కాదన్నారు.
ఏదైనా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ వ్యాఖ్యానించారు. కానీ ప్రజాక్షేత్రంలో తేల్చుకోడానికి టీడీపీకి దమ్ము లేదని ఎద్దేవా చేశారు. 'పేదలకు మంచి జరగడం చంద్రబాబుకు ఇష్టం లేదా?, పేదలకు మంచి చేస్తుంటే టీడీపీ కోర్టులకు వెళ్లడంలో అర్థమేంటి?' అని ప్రశ్నించారు. టీడీపీకి వ్యక్తుల ప్రయోజనాలే ముఖ్యం కానీ వ్యవస్థలు కాదన్నారు బొత్స. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు. అడ్వకేట్ జనరల్ చట్టం తెలియని వ్యక్తేమీ కాదన్నారు. కొంత మంది తీర్పుకు వక్రభాష్యం చెబుతున్నారని ఆరోపించారు.