బిల్డ్ ఏపీ భూముల వేలంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

‘చూస్తుంటే రాష్ట్రంలో ప్రజలు సంపన్నులు. ప్రభుత్వం పేదదిగా ఉన్నట్లు కన్పిస్తోంది. ఓ వైపు ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేస్తారు. మరో వైపు ప్రభుత్వ భూములు అమ్ముతారు? భూములు అమ్మకుండా పథకాల అమలు సాధ్యం కాదా?. అయినా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ భూములను ఈ వేలం వేయాల్సిన అవసరం ఏముంది ’ అని హైకోర్టు బిల్డ్ ఏపీ భూముల వేలంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గుంటూరు, విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వం 200 కోట్ల రూపాయలకు పైగా సమీకరించాలని ప్రతిపాదించింది.
దీనిపై హైకోర్టులో గుంటూరుకు చెందిన సురేష్ బాబు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు పై వ్యాఖ్యలు చేసినట్లు న్యాయవాది శ్రీనివాసరావు ఓ ఛానల్ తో మాట్లాడుతూ తెలిపారు. ప్రభుత్వ భూములను రక్షించుకోవాలి కానీ అమ్ముకోవడం ఎంతవరకు సమంజసమని ధర్మాసనం ప్రశ్నించింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వ తరపు న్యాయవాది గడువు కోరారు. తీర్పుకు అనుగుణంగానే భూముల వేలం ఉండాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.