ఏపీలో మాల్స్..రెస్టారెంట్లూ ఓపెన్

ఆంధ్రప్రదేశ్ లో క్రమక్రమంగా మాల్స్ తోపాటు రెస్టారెంట్లు కూడా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఓ వైపు ప్రజలను భౌతిక దూరం విషయంలో చైతన్యపరుస్తూ ఈ దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం నాడు జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడెక్కడ ఎలాంటి విధానాలు పాటించాలన్న దానిపై స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్స్ (ఎస్ఓపీ) తయారు చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బస్సుల్లో పాటించాల్సిన ప్రోటోకాల్స్ ను రూపొందించాలని ఆదేశించారు. ‘‘కరోనా లక్షణాలు ఉన్నాయని తెలియగానే ప్రజలు పరీక్షలతో పాటు... వైద్యం చేయించుకోవడానికి ముందుకు రావాలి. తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టగలుగుతాం. ఈ విషయం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇక కరోనా లక్షణాలు కనిపించగానే వైరస్ ఉన్నదీ లేనిదీ ఒక వ్యక్తి ఎలా నిర్ధారించుకోగలుగుతారు అన్నది కూడా చాలా ముఖ్యం.
ఆ వ్యక్తి ఎవర్ని సంప్రదించాలి? ఎలా సంప్రదించాలి? అన్న దానిపై ఒక పటిష్టమైన యంత్రాంగం అవసరం. ప్రతి ఇంటికీ ఒక కరపత్రం పంచాలి. ప్రజలు తమంతట వారే ముందుకు రావడం ద్వారా పరిస్థితిలో మార్పు వస్తుంది. కరోనా రావటం తప్పు కాదని, అది పాపం కాదనే విషయాన్ని ప్రజలకు గట్టిగా తెలియజేయాలి.వారి వైఖరిలో మార్పు రావాలి. ఇప్పుడు ఇవన్నీ ఎంతో ముఖ్యమైనవి. భవిష్యత్లో విలేజ్ క్లినిక్స్ స్థాయికి కోవిడ్ పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలి’’ అని సూచించారు. వలస కూలీలు కోసం బస్సులు తిప్పడానికి సిద్ధంకావాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం విధి, విధానాలు తయారు చేయాలని.. వలస కూలీలను టిక్కెట్టు కూడా అడగవద్దని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నడిచివెళ్తున్న వలస కార్మికులు ఎక్కడ తారసపడినా వారిని బస్సులు ఎక్కించి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకువెళ్లాలన్నారు. ఇదివరకు ఆదేశించిన విధంగా వలస కూలీలకు భోజనాలు, తాగు నీరు ఏర్పాటు చేయాలని సూచించారు.