విజయసాయిరెడ్డి ఆ రహస్యాలు ఇప్పటి దాకా ఎందుకు దాచారో!

కన్నాను అంతగా తిడుతున్నా జీవీఎల్ ఖండన లేదేంటి?
ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనికి కారణం కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఓ ట్వీట్. ఓ వైపు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) 795 రూపాయలకు కిట్స్ కొనుగోలు చేసింది. వాస్తవానికి కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణలను కౌంటర్ ఇచ్చేందుకు ఏపీ సర్కారుకు ఈ ఒక్క ఆధారం చాలు. ఓ వైపు కేంద్రం కొనుగోలు చేసింది 795 రూపాయలు పెట్టి. ఏపీ కొనుగోలు చేసింది 730 రూపాయలకు . ఈ రెండిండి మధ్య తేడా చూస్తే అవినీతి జరిగింది అనటానికి ఆస్కారం ఉండదు. కానీ కన్నా లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ తో ఏపీ సర్కారు ఎక్కడ లేని ఉలికిపాటుకు గురై తాము కూడా చత్తీస్ గడ్ రేటుకే కొంటామని..ఈ మేరకు చర్చలు జరుపుతున్నామని..ఒప్పందంలో క్లాజు ఉందని అంటూ నానా హంగామా చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ఇవేమీ పట్టించుకోండానే చత్తీస్ గడ్ కిట్ ఫలితాలు 30 నిమిషాల్లో వస్తుంది అని..ఏపీ కిట్ ఫలితం పది నిమిషాల్లోనే వస్తుంది అనే వాదన తెరపైకి తీసుకొచ్చారు. అది కాస్త వట్టిదే అని తేలిపోయింది. వైసీపీ ఉలికిపాటు చూసిన తర్వాత ఎవరికైనా కిట్స్ వ్యవహారంలో ఏదో జరిగిందని అనుమానం రావటం ఖాయం.
తాము అవినీతి చేస్తే కేంద్రం కూడా అవినీతి చేసినట్లే అనే వాదన తెరపైకి తీసుకొస్తే ఏమి జరుగుతుందో తెలుసు కనుక వైసీపీ సర్కారు ఈ వాదనను పక్కన పెట్టి కన్నా లక్ష్మీనారాయణను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. కన్నా ను చంద్రబాబు 20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడని..అధిష్టానం ఇచ్చిన డబ్బులను కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి కాజేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. సహజంగానే ఇక్కడ కొన్ని ప్రశ్నలు రావటం సహజం. కన్నా లక్ష్మీనారాయణ కిట్ల గురించి ప్రశ్నించకపోయి ఉంటే ఆయన విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నట్లు చంద్రబాబుకు అమ్ముడుపోయిన విషయం కానీ, పార్టీ నిధుల గోల్ మాల్ విషయాన్ని విజయసాయిరెడ్డి వదిలేసేవారన్న మాట. కన్నా కిట్స్ వ్యవహారం ప్రస్తావించే వరకూ విజయసాయిరెడ్డి ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. అంతే కాదు..కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి ఒకప్పుడు తాను ఆడిటర్ పనిచేశానని..ఆయన బ్యాంకులను మోసం చేశాడని కూడా విజయసాయిరెడ్డి ఆరోపించారు. కానీ బాధ్యత గల ఆడిటర్ గా ఆయన అప్పుడు ఈ అంశంపై సంబంధిత సంస్థలకు ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా?.
కేవలం ఇప్పుడు మాత్రం ఆరోపణలు చేస్తున్నారా?. ఇదిలా ఉంటే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఎంపీ విజయసాయిరెడ్డి తోపాటు ఆ పార్టీ నేతలు అందరూ మూకుమ్మడి ఎటాక్ చేస్తున్నా కూడా బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు మాత్రం మాట కూడా మాట్లాడకపోవటం బిజెపితోపాటు ఏపీలోని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీకి సంబంధించిన అంశాల్లో నిత్యం స్పందించటంలో ముందుండే జీవీఎల్ కన్నా విషయంలో కనీసం ఖండన కూడా ఇవ్వకపోవటం ఏమిటి అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే సునీల్ దేవదర్ పార్టీ నిధుల వ్యవహారంపై రంగంలోకి దిగి ఖండన ఇవ్వటం వైసీపీ వర్గాలను కూడా ఒకింత షాక్ కు గురిచేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బిజెపి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం వల్ల రాబోయే రోజుల్లో అధిష్టానం ఎలా స్పందిస్తుందో అన్న టెన్షన్ వైసీపీ వర్గాల్లో ఉందని ఆ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.