కర్నూలుకు ప్రత్యేక బృందాలను పంపండి

ఏపీలో అత్యధిక కరోనా కేసులతో సతమతం అవుతున్న కర్నూలు జిల్లాకు ప్రత్యేక బృందాలను పంపాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో ప్రజలను కరోనా వైరస్ భయకంపితులను చేస్తోందని అన్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ఈ వ్యాధి కర్నూలు జిల్లాలో వ్యాప్తి చెందడానికి కారణాలు, తప్పులను అన్వేషించడంలో జనసేన పార్టీకి ఎటువంటి ఆసక్తి లేదన్నారు. ‘ప్రజల ఆరోగ్యమే జనసేన ఆకాంక్ష. ఈ సమస్య మనందరిది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తోంది. ఈ జిల్లాలో ఈ క్షణం వరకు అందిన సమాచారం ప్రకారం 203 కేసులు నమోదు అయ్యాయి. అయిదుగురు చనిపోయారు. నలుగురు రోగులు కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
ఇన్ని కేసులు ఈ జిల్లాలో నమోదవడం పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో తెలుపుతోంది. అందువల్ల కర్నూలు జిల్లాకు ప్రత్యేక బృందాల్ని పంపండి. ప్రత్యేక వ్యూహంతో వ్యాధి ఉదృతిని అరికట్టి, ప్రజలలో మనోధైర్యాన్ని నింపండి. వ్యాధి నివారణలో ఇప్పటి వరకు జరిగిన పొరపాట్లను పునరావృతం కాకుండా చూడండి. వ్యాధి నివారణకు ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు పని చేస్తున్న వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు అవసరమైనన్ని రక్షణ కిట్లు, ఇతర అవసరాలు సమృద్ధిగా అందించండి. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే ఈ వ్యాధి ఉదృతి ఈ జిల్లాలో చేయి దాటే ప్రమాదం ఉంది’ అని పేర్కొన్నరు.