బాహుబలి2ని బీట్ చేసిన సరిలేరు నీకెవ్వరు
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన ప్రముఖ చిత్రాల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ ఒకటి. మహేష్ బాబు, రష్మిక మందన నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డు కలెక్షన్లు సాధించింది. ఉగాది కానుకగా జెమినీ టీవీలో వచ్చిన ఈ చిత్రం అత్యధిక టెలివిజన్ వ్యూవర్షిప్ రేటింగ్ (టీవీఆర్)ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ‘బాహుబలి 2’రికార్డులను సైతం ఈ సినిమా అధిగమించటం విశేషం. ఇప్పటివరకు 22.70 టీవీఆర్తో బాహుబలి-2 అగ్ర స్థానంలో ఉండగా.. తాజాగా మహేశ్ సరిలేరు నీకెవ్వరు చిత్రం 23.4 టీవీఆర్ను సాధించి గత రికార్డులన్నింటిని తిరగరాసింది.
బాహుబలి తొలి పార్ట్ కు 21.84 టీవీఆర్ వచ్చింది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు అమెజాన్ ప్రైమ్లో కూడా వచ్చేసింది. అంతేకాకుండా ఈ సినిమా హెచ్డీ ప్రింట్ను కొంత మంది ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేశారు. అయినా ఇటీవల జెమినీ ఛానల్లో వచ్చిన ఈ సినిమాను ఎవరూ ఊహించన విధంగా బ్రహ్మరథం పట్టారు. దీంతో చిత్ర యూనిట్తో పాటు మహేశ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.