అవినీతి లేకుండా కిట్లు కొన్నారు

వైద్య శాఖ అధికారులకు సీఎం జగన్ ప్రశంసలు
కరోనా పరీక్షల కోసం కొనుగోలు చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కొనుగోలు వ్యవహారంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఎంతో ఒత్తిళ్ల మధ్య కూడా వైద్య శాఖ అధికారులు చాలా బాగా పనిచేశారని..అవినీతి లేకుండా చేయాలనే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ముందుకెళ్లటం ప్రశంసనీయం అన్నారు. ‘చాలా నిజాయితీగా ఆలోచన చేసి ఆర్డర్ చేశారు. మనకు కిట్లు అనేవి అవసరం. కేంద్రాన్ని అడిగితే ఇవ్వలేని పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడున్నా సరే.. మీరే కొనుక్కోండని కేంద్రం చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన కంపెనీకి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆర్డర్ ఇచ్చింది. ఐసీఎంఆర్ 795లకు కొనుగోలుకు ఆర్డర్ ఇస్తే... అది తెలిసి కూడా ఆ రేటు కూడా రూ.65ల తక్కువ రేటుకు ఏపీ ఆర్డర్ ప్లేస్ చేసింది. ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు పర్చేజ్ ఆర్డర్లో షరతు పెట్టారు. ఒకవేళ తక్కువ ఖర్చుకు ఏ రాష్ట్రానికైనా అమ్మితే.. ఆ రేటు ప్రకారమే చెల్లిస్తామని ఆర్డర్లో స్పష్టంచేశారు.
ఇలాంటి ఆలోచన సాధారణంగా అయితే ఎవ్వరూ చేయరు. ఎలాంటి రాజీపడకుండా, అలాగే కిట్లను వేగంగా తెప్పించుకోవడంలో ఆలస్యం చేయకుండా తీసుకున్న చర్యలు ప్రశంసనీయం. ఇప్పటివరకూ 25శాతం మాత్రమే పేమెంట్ఇచ్చారు. ఇంత ఒత్తిళ్ల మధ్య మంచి ఆలోచనతో కొనుగోలు చేశారు. మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ కిట్లు బయట దేశంలో తయారు అయ్యాయి. ఇప్పుడు అదే కంపెనీ మన దేశంలో తయారుచేయడానికి ఐసీఎంఆర్ అనుమతులు ఇచ్చింది. దీనివల్ల కిట్ రేటు తగ్గింది. మనం పెట్టుకున్న షరతు కారణంగా రేటు కూడా తగ్గబోతుంది. దీనికి కూడా ఆ కంపెనీ అంగీకరించింది. నేను అధికారులను అభినందిస్తున్నా’ అని జగన్ వ్యాఖ్యానించారు.