ఏపీలో 16 కోట్ల ఉచిత మాస్కుల పంపిణీ

కరోనా అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీ చేయాలని ఆదేశించారు. మాస్కుల వల్ల కొంత రక్షణ లభిస్తుందని.. వీలైనంత త్వరగా పంపిణీ జరగాలన్నారు. కరోనా నివారణా చర్యలపై సీఎం జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు.
హైరిస్కు ఉన్న వారిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. వృద్ధులు, మధుమేహం, బీపీ ఇతరత్రా వ్యాధులతో బాధపడే వాళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో చేర్పించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. నమోదవుతున్న కరోనా కేసులు, వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జోన్లను, క్లస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సీఎం చెప్పారు.



