Telugu Gateway
Politics

కెసీఆర్ సంచలన నిర్ణయం..అందరి వేతనాల్లో భారీ కోతలు

కెసీఆర్ సంచలన నిర్ణయం..అందరి వేతనాల్లో భారీ కోతలు
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా దెబ్బకు రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోవటంతో వేతనాల్లో భారీ కోత పెట్టారు. ఆదివారం నాటి విలేకరుల సమావేశంలోనే కెసీఆర్ ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇఛ్చారు. అసలు ఉద్యోగులకు వేతనాలు కూడా ఇఛ్చే పరిస్థితి లేదని..ఇది ఆపద సమయం అని అందరూ సర్దుకోవాలని వ్యాఖ్యానించారు.. అన్నట్లుగే మరుసటి రోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా ప్రతినిధుల దగ్గర నుంచి ఉద్యోగుల వరకూ అందరి వేతనాల్లోనూ భారీ కోత పెట్టారు. ఈ మేరకు సోమవారం నాడు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

‘తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో, అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్ లో సోమవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన పిదప వివిధ రకాల వేతనాల చెల్లింపులపై నిర్ణయం తీసుకున్నాం’ అని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ముఖ్యమంత్రి, రాష్ర్ట మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తారు.

ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధిస్తారు.

మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధిస్తారు.

నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తారు.

అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత విధిస్తారు.

నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10 శాతం కోత విధిస్తారు.

అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వేతనాల్లో కోత విధిస్తారు.

Next Story
Share it