హైకోర్టులో రేవంత్ బెయిల్ పిటీషన్
నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ ను ఉపయోగించారనే ఆరోపణలతో అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిల్ పిటీషన్ స్థానిక కోర్టులో తిరస్కరణకు గురి కావటంతో ఆయన హైకోర్టు గడప తొక్కారు. 111 జీవోకు వ్యతిరేకంగా మంత్రి కెటీఆర్ ఓ విలాసవంతమైన ఫాంహౌస్ ను నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి రేవంత్ హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలు చేశారు. నార్సింగ్ పోలీస్స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మియాపూర్ కోర్టు విధించిన రిమాండ్ రద్దు చేయాలని మరో పిటిషన్లో కోరారు.
పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావాల్సి ఉన్నందున తక్షణం బెయిల్ మంజూరు చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ కేసులను కాంగ్రెస్ సీనియర్ నేత, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ బృందం వాదించనున్నట్లు సమాచారం. సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వంలో లాయర్లు బృందం హైదరాబాద్ వచ్చింది. కాంగ్రెస్ అధిష్టానం చొరవ తీసుకుని రేవంత్ రెడ్డి కేసులను వాదించేందుకు సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వంలోని న్యాయవాదుల బృందాన్ని హైదరాబాద్ పంపినట్లు చెబుతున్నారు.