ఇది 130 కోట్ల మంది భారతీయులు చేస్తున్న యుద్ధం
కరోనా వైరస్పై 130 కోట్ల మంది భారతీయులు యుద్ధం చేస్తున్నారని, గడప దాటకుండానే ఈ మహమ్మారిని తరిమికొట్టాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. మహాభారతాన్ని 18 రోజుల్లో ముగించారని, 21 రోజుల్లో కరోనాను జయించలేమా అని ప్రశ్నించారు. వారణాసి నియోజకవర్గ ప్రతినిధులు, నిపుణులు, శాస్త్రవేత్తలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పుడు అంతా బాగుందని తాను చెప్పలేనని ఆయన అన్నారు. కరోనా వైరస్ను సంఘటితంగా ఎదుర్కొని విజయం సాధించాలని పిలుపు ఇచ్చారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి సామాజిక దూరాన్ని పాటించాలని ఇది మన అలవాటుగా మారాలని కోరారు.
ఈ మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో అవసరమైన సమాచారం కోసం 9013151515 వాట్సప్ నెంబర్తో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెంబర్కు నమస్తే అని వాట్సాప్ చేస్తే సమస్త సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. యావత్ దేశం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదని, ఇల్లే మన కేరాఫ్ అడ్రస్గా మారాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. విపత్కర సమయంలో సేవలందిస్తున్న వారిని మనం కొనియాడాలని చెప్పారు. వారణాసి దేశానికి శాంతి, సహనశీలతను నేర్పిందని అన్నారు.