Telugu Gateway
Andhra Pradesh

స్థానిక ఎన్నికలపై ఏపీలో ‘లేఖల వార్’

స్థానిక ఎన్నికలపై ఏపీలో ‘లేఖల వార్’
X

ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రాజకీయం కాస్తా అధికారుల చుట్టూ తిరుగుతోంది. కరోనా వ్యవహారం ప్రభుత్వం చూసుకుంటుంది..షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిపించండి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సోమవారం నాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. సీఎస్ లేఖకు ఎస్ఈసీ రమేష్ కుమార్ అంతే ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ మేరకు ఆయన సీఎస్ కు మూడు పేజీల లేఖను పంపారు. ఈ లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు. కేవలం కరోనా కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశామని..ఈ ఎన్నికలు వాయిదా పడితే కేంద్రం నుంచి నిధులు రావనే విషయంలో కూడా వాస్తవంలేదని తేల్చిచెప్పారు. గతంలో ఎన్నికలు నిర్వహించకుండా కూడా నిధులు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ‘ .గతంలో రాజ్ భవన్‌ కంటే ముందు ఆర్థిక శాఖలో పనిచేశాను. ఆర్థిక వ్యవహారాలపై నాకు అవగాహన ఉంది. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిసా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపేశారు.

ఎన్నికలకు ఆర్థిక సంఘం నిధులకు లింక్ పెట్టవద్దు. గతంలో కూడా ఇదేవిధంగా ఎన్నికలు నిలిపివేసినా కేంద్రం నుంచి నిధులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గోవాలో కూడా ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తున్నారు. కరోనా ఛాలెంజ్ ఎదుర్కుంటున్న ప్రస్తుత దశలో ఏపీ ఒంటరిగా లేదు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను, ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో మార్గదర్శకాలను పాటిస్తున్నా. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ ను విడిగా చూడటం సాధ్యం కాదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఈ నెల14న మీతో కలసిన సమయంలో కూడా వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శితో టచ్ లో ఉన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను.అంతే కాదు..అంతకంటే ముందు కూడా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శితో ఫోన్ లో మాట్లాడాను.

ఇవి అన్నీ తాను స్వయంగా నా తరపున చేసిన పనులు. కానీ కరోనా నియంత్రణ పనుల్లో బిజీగా ఉన్న అధికారులు తనతో ఎలాంటి డేటా షేర్ చేసుకోలేదు. ఏ అధికారి కూడా తన వద్దకు వచ్చి వివరాలు ఇవ్వలేదు. కమిషన్ పై నిందలు వేయటం ఏ మాత్రం కరెక్ట్ కాదు. కరోనా వైరస్ నియంత్రణ ఎంత వేగంగా సాధ్యం అయితే అంతే వేగంగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తాం. మీరు రాసిన లేఖలోని అంశాలు మీడియాలో కూడా చూశాను. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేను కూడా మీడియా ద్వారానే లేఖ విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.’ అని పేర్కొన్నారు. ఎస్ఈసీపై కొంత మంది అనుచిత, దురుద్దేశపూరిత వ్యాఖ్యలు చేసిన అంశాన్ని కూడా ఆయన తన లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంతో సీఎస్ తో నిర్మాణాత్మక సహకారం అందించటానికి కమిషన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు.

Next Story
Share it