వైసీపీలో చేరిన కరణం వెంకటేష్

అధికార వైసీపీలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా టీడీపీకి చెందిన కీలక నేతలు పలువురు వైసీపీ బాట పట్టిన సంగతి తెలిసిందే. గురువారం నాడు ప్రకాశం జిల్లాకు సంబంధించినంత వరకూ టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత కరణం బలరామ్ టీడీపీనీ వీడారు. ఆయన వైసీపీ కండువా కప్పుకోలేదు కానీ..వైసీపీలో చేరినట్లే. ఎందుకంటే ఆయన సమక్షంలో కరణం బలరామ్ తనయుడు కరణం వెంకటేష్ కు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను అధికార పార్టీతో కలసి వెళతానని మీడియా సాక్షిగా కరణం బలరామ్ తెలిపారు.
కరణం వెంకటేష్ తోపాటు మాజీ మంత్రి పాలేటి రామారావు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వెంకటేశ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ చీరాల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు.