Telugu Gateway
Andhra Pradesh

క్రిమినల్స్ పాలించాలి అంటే వైసీపీకి మద్దతు ఇవ్వండి

క్రిమినల్స్ పాలించాలి అంటే వైసీపీకి మద్దతు ఇవ్వండి
X

జనసేన ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘క్రిమినల్స్ మనల్ని పాలించాలి అనుకుంటే వైసీపీకి మద్దతు ఇవ్వండి. సమాజంలో ధైర్యం నూరిపోసేందుకే జనసేన పార్టీ. రాష్ట్ర ప్రయోజనాలకు జనసేన అవసరం. ఏడేళ్ళు కాదు ఏడు దశాబ్దాలు అయినా జనసేన నిలబడుతుంది. దేశ సమగ్రత కోసమే బిజెపితో పొత్తు. అధికారం వచ్చినా రాకున్నా జనసేన ఉనికి కోల్పోదు’ అని పేర్కొన్నారు. శనివారం నాడు రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యుడు నాగబాబు, పొలిట్ బ్యూరో సభ్యులు అర్హంఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఒక విధంగా భయపెడితే... వైసీపీ మరోలా భయపెట్టాలని చూస్తోందని అన్నారు. లొంగిపోయి ఉనికి కోల్పోతామో... గుండె ధైర్యంతో నిలబడి సత్తా చాటడమో యువతే నిర్ణయించుకోవాలని అన్నారు. సమ సమాజం నిర్మిద్దామనుకుంటే జనసేనకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ధైర్యం, తెగింపు ఉండాలని, లేనివారు జనసేనలోకి రావొద్దని అన్నారు. పార్టీ ప్రారంభించే నాటికి ఆంధ్ర పాలకులు చేసిన తప్పులకు ఆంధ్ర ప్రజలను తిడుతుంటే, దాడులు చేస్తారనే భయంతో ఒక్క నాయకుడు కూడా ధైర్యంగా మాట్లాడలేకపోయారు.

ఒక్కొక్కరికి వేలకోట్లు, వేల ఎకరాలు ఉన్నా వారిలో ధైర్యం చచ్చిపోయింది. ధైర్యంగా ఒక్కడైనా మాట్లాడాలని ఆ రోజు పార్టీ పెట్టాను. అధికార పార్టీ బెదిరింపులకు, ఒత్తిళ్లకు భయపడి కొంతమంది నాయకులు పారిపోతున్నారు. అలాంటి వారిని పెట్టుకొని పార్టీ నిర్మాణం చేయలేను. పిడుగు మీద పడ్డ, ఫిరంగు వదిలినా బెదరకుండా నిలబడే వ్యక్తులే పార్టీకి కావాలి. అలాంటి వారి కోసమే ఎదురుచూస్తున్నాను. రాజమండ్రిలో కవాతు చేస్తే దాదాపు 10 లక్షల మంది వరకు వచ్చారు. ఓటు మాత్రం ఎవరైతే రౌడీయిజం చేస్తారో, క్రిమినల్స్ ను ప్రోత్సహిస్తారో వారికి వేశారు. మహాత్ముడిని పూజిస్తాం... నేతాజీని గౌరవిస్తాం... అంబేద్కర్ ను గుండెల్లో పెట్టుకుంటాం... కానీ ఎన్నుకున్నది మాత్రం నేరచరిత్ర ఉన్న వ్యక్తులని. ఇదేమి లాజిక్కో నాకు అర్ధం కాదు. భారత దేశానికి సర్ధార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అంత బలమైన హోంమంత్రి అమిత్ షా. అలాంటి వ్యక్తి వచ్చి భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీని విలీనం చేయమని కోరినా కాదన్నాను. రాష్ట్ర ప్రయోజనాలకు జనసేన పార్టీ అవసరం ఉందని గ్రహించి ఆ నిర్ణయం తీసుకున్నాను.

జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీతోపాటు అన్ని పార్టీలు వెంపర్లాడాయి. కానీ జనసేన మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దీనికి కారణం దేశాన్ని పటిష్టం చేయాలన్న, మిగతా పార్టీలన్ని వారసత్వ పార్టీలే. వైసీపీ నాయకులు ఢిల్లీలో బీజేపీ నాయకులకు మద్దతుగా మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి మేము వాళ్లకు వ్యతిరేకం అంటారు. ఢిల్లీలో కాళ్ళు పట్టుకుంటారు. ఇక్కడకొచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు. నేను అలా చేయను. జనసేన పార్టీ స్థాపించింది అందరూ వదిలేసిన సమస్యలను పరిష్కరించడానికే. నిస్సహాయులకు అండగా ఉండాలనే. కర్నూలులో 14 ఏళ్ల అమ్మాయి సుగాలీ ప్రీతిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. న్యాయం చేయాలని అన్ని ఆధారాలతో దివ్యాంగురాలైన ఆమె తల్లి కన్నీటితో వేడుకుంటే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంగానీ, ఇప్పటి వైసీపీ ప్రభుత్వంగానీ పట్టించుకోలేదు. జనసేన పార్టీ పోరాడి బాధితులకు అండగా నిలబడింది కనుకే ఇవాళ సుగాలీ ప్రీతి కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. గోదావరి రైతుల సమస్యలు, అమరావతి రైతుల ఆవేదనను ప్రపంచానికి తెలిసేలా చేశాం. వ్యవస్థలో మార్పు రావాలంటే మనలాంటి వారు బయటకు రావాలి. జనసేన ప్రభావం ఏమీ లేదంటూనే భౌతిక దాడులకు దిగుతున్నారు. ఇన్ని బెదిరింపులకు దిగుతున్నా అనంతపురం జిల్లాలో పద్మావతి పోటీకి దిగారు. అలాంటి వీరమహిళలు మనకు ఉన్నారు. కాకినాడలో దాడులు చేసినప్పుడూ వీర మహిళలు ధైర్యంగా ఉన్నారు. అధికార పార్టీ దాడులకు, ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా నిలబడ్డ అభ్యర్ధులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జనసైనికులపై దాడులు చేసినా, అక్రమంగా కేసులు పెట్టి బెదిరించినా, ప్రలోభాలకు గురి చేసినా బలంగా నిలబడే సమూహం జనసేనది. మాదైన రోజున సత్తా చూపిస్తాం. అప్పటి వరకు భరిస్తామని” అన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “పాతిక సంవత్సరాల భవిష్యత్తు కావాలి అని కోరుకుంటున్న యువత ఆకాంక్షలను నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రాజకీయ జీవితంలో మా తండ్రి హయాం నుంచి మా కుటుంబం 13 ఎన్నికలు చూశాం. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు లేవు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా, అందరికీ స్వేచ్ఛాయుతంగా ఎన్నికల్లో పోటీ చేయడం అంటే గర్వంగా భావించేవారు. అలాంటి పరిస్థితులు మారిపోయి ధనవంతులకు, కొన్ని కుటుంబాలకు కేటాయించడం ద్వారా గ్రామాల్లో పట్టుకోసం వ్యవస్థకు చెడ్డ పేరు తెచ్చే పరిస్థితులు తీసుకువచ్చారు. అలాంటి పరిస్థితుల్లో కూడా జనసైనికులు బలంగా నిలబడ్డారు. శ్రీకాళహస్తి ఘటన సందర్భంలోగానీ, అనంతపురం జిల్లాలో రాళ్ల దెబ్బలకు సిద్దపడి కదలకుండా నిల్చున్న సందర్భాలుగానీ జనసేన పోరాట పటిమకు నిదర్శనం.

గోదావరి జిల్లాల్లో కూడా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఉదయం ఉన్న పరిస్థితులు మధ్యాహ్నానికి ఉండడం లేదు. 50 మంది నామినేషన్లు వేస్తే సాయంత్రానికి వారు కనబడడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి అభ్యర్ధులకు కోటా పెట్టి గెలిపించుకు రమ్మంటే పరిస్థితులు ఇంకా ఎలా ఉంటాయి. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పండుగ వాతావరణంలో జరగాలి. క్షేత్రస్థాయిలో మాట్లాడే వ్యక్తులు, నాయకత్వం ఇక్కడి నుంచే రావాలి. అందుకు విరుద్దంగా ఈ కులమతాల చిచ్చులు ఏంటి? మన పార్టీ అధ్యక్షుడు అలాంటి వారిని గుర్తించి సీట్లు ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు. 60 శాతం సీట్లు యువతకే కేటాయించమన్నారు. అదే ప్రణాళికతో క్షేత్ర స్థాయిలో ముందుకు వెళ్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా, ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుల నేపధ్యంలో సభకు చాలా మంద రాలేకపోయారు. అయితే కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్కరినీ మనం గౌరవించాలి. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేసిన వారిని పిలిపించి ఓ సమీక్ష సమావేశం నిర్వహిస్తాం. వారి త్యాగాలను నాయకులు మరచిపోవద్దు” అన్నారు. నాగబాబు మాట్లాడుతూ హిట్లర్ లాంటి వాడే పతనం అయిపోయాడు..ఇది కూడా ఎంతో కాలం పట్టదన్నారు. ఒకరోజు కుళ్లిన రాజకీయాలు అనే బండరాయి బద్దలయ్యే రోజు వస్తుంది. నాలుగేళ్లలో జనసేన అధికారంలోకి వస్తుందన్నారు.

Next Story
Share it