ఎన్ పీఆర్ లో మార్పులు కోరుతూ అసెంబ్లీలో తీర్మానం

ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జనాభా పట్టిక (ఎన్ పీఆర్)లో ఉన్న నూతన ప్రశ్నలు కొన్ని మైనారిటీలను భయాందోళనలకు గురిచేస్తున్నాయని..వాటిని తొలగించాలని కోరుతూ త్వరలోనే జరగనున్న అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు జగన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు కేంద్రాన్ని విన్నవిస్తామని తెలిపారు. దేశ జనాభా పట్టికను గతంలో 2010 లో ఉన్న నిబంధనల ప్రకారమే కొనసాగించాలని ఎపీ ప్రభుత్వం కోరబోతోంది. ఎన్.పి.ఆర్ లోని కొన్ని ప్రశ్నలతో మైనార్టీలు అభద్రతకు గురి అవుతున్నాయని ఆయన చెప్పారు.దీనిపై పార్టీలో చర్చించామని ఆయన వెల్లడించారు.
ఆ తర్వాతే దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించామని, పాత విధానంలోనే ప్రశ్నలు ఉండాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. గతంలో పార్లమెంట్ లో సీఏఏకి మద్దతు ఇచ్చిన వైసీపీ తర్వాత మాత్రం సీఎఎను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఎన్ పీఆర్ లో నిబంధనలు మార్చాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రతిపాదించింది. మరి జగన్ సర్కారు ప్రతిపాదనపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.