కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు స్విస్ కంపెనీ ఆసక్తి

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో గురువారం నాడు స్విస్ కంపెనీ ఐఎంఆర్ ఏజీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల అవకాశాలపై చర్చించిన కంపెనీ ప్రతినిధులు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి చూపినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 10 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఆలోచన చేస్తున్నామని వీరు వెల్లడించారు. ఈ సందర్భంగా ఐఎంఆర్ కంపెనీ కార్యకలాపాలను సీఎం అడిగితెలుసుకున్నారు. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం లాంటి గనుల తవ్వకాలను చేపట్టడంతోపాటు విద్యుత్, ఉక్కు కర్మాగారాలను నడుతున్నామంటూ ఐఎంఆర్ కంపెనీ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్కు వివరించారు.
ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసే కడప స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్ఎండీసీతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ఐఎంఆర్ కూడా మరొక స్టీల్ప్లాంట్ పెడితే చక్కటి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని సీఎం తెలిపారు. నీరు, కరెంటు, మౌలిక సదుపాయాలతోపాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం వీరికి హామీ ఇచ్చారు. కృష్ణపట్నం పోర్టు, అక్కడి నుంచి రైల్వే మార్గం, జాతీయ రహదారులతో మంచి రవాణా సదుపాయం ఉందని వారికి వివరించారు. రానున్నరోజుల్లో వైఎస్సార్ జిల్లా ప్రాంతం స్టీల్సిటీగా రూపాంతరం చెందడానికి పూర్తి అవకాశాలున్నాయని ఐఎంఆర్ కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.