జగన్ ది రాజకీయ వికృత క్రీడ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర తీవ్ర విమర్శలు చేశారు. నీ రాజకీయ వికృత క్రీడ కోసం పార్టీలో చేర్చుకున్న వల్లభనేని వంశీది ఏ సామాజికవర్గం. నిన్న కాక మొన్న కండువాలు వేసిన కరణం బలరామ్ ది ఏ కులం. నీ కపంనీల్లో పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్ ది ఏ కులం. నీతో ఆర్ధిక సంబంధాలు ఉన్న పీవీపీది ఏ కులం?. పీవీపీకి ఎంపీ సీటు ఇచ్చింది ఎవరు?. మాట్లాడితే మాకు 151 సీట్లు ఉన్నాయి అంటున్నారు కదా?. రాష్ట్రంలో పలానా సామాజిక వర్గం వాళ్ళే ఉండాలని చట్టం చేయండి అని నరేంద్ర వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సామాజిక వర్గాల గురించి మాట్లాడటం దారుణమన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్, చంద్రబాబుది ఒకే సామాజిక వర్గం అని వ్యాఖ్యానించటం ద్వారా సీఎం తన హోదాను దిగజార్చుకున్నారని విమర్శించారు. ఆరు వారాలు ఎన్నికలు ఆగిపోతే ఫలితాలు ఏమైనా తారుమారు అవుతాయా?. ఎందుకంత భయం అన ప్రశ్నించారు.
సీఎం స్థాయి వ్యక్తి కుల రహితంగా ఉండాలని నరేంద్ర హితవు పలికారు. సుపరిపాలన చేయాలని ప్రజలు మీకు 151 సీట్లు ఇచ్చారని.. దోపిడీలు, దౌర్జన్యాలు చేయాలని మీకు అన్ని సీట్లు ఇవ్వలేదన్నారు. జగన్ ధర్మం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. వైసీపీ నేతలు.. మహిళలు, బీసీలని చూడకుండా దౌర్జన్యాలు చేశారన్నారు. జగన్ రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. మాచర్లలో ఒక ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేపై దాడులు చేస్తే, రాష్ట్రంలో పలు చోట్ల వైసీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటే జగన్ ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. కరోనా పై ప్రపంచం అంతా వణికిపోతుంటే జగన్ మాత్రం ఒక పారాసిటమాల్ తో తగ్గిపోతుందని సీఎం వ్యాఖ్యానించటం దారుణమన్నారు. మరి ప్రపంచంలో ఎవరికీ ఈ విషయం తెలియక విమానాశ్రయాలు, నగరాలకు నగరాలు బంద్ చేస్తున్నారా?. జగన్ ప్రపంచం అంతా తిరిగి పారాసిటమాల్ తో ఆదుకోవచ్చని అన్నారు. జగన్ కు వైద్యశాస్త్రంలో నోబెల్ రావొచ్చని..తాము కూడా దీనికి మద్దతు ఇస్తామని వ్యంగాస్త్రాల సంధించారు.