వైసీపీలో చేరిన డొక్కా

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యప్రసాద్ వైసీపీలో చేరారు. సోమవారం నాడు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. కొద్ది కాలం క్రితమే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కలకలం రేపారు. మూడు రాజధానుల బిల్లు మండలి ముందుకు వచ్చిన సమయంలో ఆయన రాజీనామా చేసి తన వైఖరిని తేటతెల్లం చేశారు. తాజాగా ఆయన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో కలిసి సీఎం జగన్ వద్దకు వెళ్లి పార్టీలో చేరారు.
వైసీపీలో చేరిన తర్వాత డొక్కా వరప్రసాద్ మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 2014లోనే వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని, కానీ కొన్ని కారణాల రిత్యా టీడీపీలో చేరాల్సి వచ్చిందని అన్నారు. రాజధాని రైతుల జేఏసీ పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. 2019 ఎన్నికల్లో తాను తాడికొండ సీటును ఆశించానని.. కానీ ఓడిపోతానని తెలిసినా ప్రత్తిపాడు సీటు ఇచ్చారని ఆరోపించారు.