దిగ్విజయ్ సింగ్ అరెస్ట్
మధ్యప్రదేశ్ రాజకీయం హాట్ హాట్ గా నడుస్తోంది. బిజెపి సేమ్ కర్ణాటక ఫార్ములానే అక్కడా అమలు చేసేందుకు రెడీ అయిపోయింది. అందులో భాగంగానే జ్యోతిరాదిత్య సింధియాను పార్టీలో చేర్చుకుని..బిజెపి రాజ్యసభ సభ్యత్వం ప్రకటించింది. అందుకు ప్రతిఫలంగా ఆయన వర్గం ఎమ్మెల్యేలు అసమ్మతి జెండా ఎగరేసి..రాజీనామాలు చేశారు. అంతే కాదు..క్యాంప్ ను బిజెపి పాలిత రాష్ట్రం అయిన కర్ణాటకలోనే పెట్టారు. దీంతో కాంగ్రెస్ సర్కారు మైనారిటీలో పడుతుంది..బిజెపి సర్కారును ఏర్పాటు చేస్తుంది. ఇదీ ప్లాన్. కానీ బలపరీక్షకు మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండర్ రెండుసార్లు ఆదేశించినా కమల్ నాథ్ సర్కారు లైట్ తీసుకుంది. ఇఫ్పుడు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ తరుణ:లో బెంగళూరులో మకాం వేసిన 21మంది రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. రమడా హోటల్లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు ఆయన ప్రయత్నించారు. కర్ణాటక కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు శివ కుమార్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వారు హోటల్ దగ్గరకు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్లటానికి వీళ్లేదంటూ బయటే ఆపేశారు. దీంతో ఆగ్రహించిన దిగ్విజయ్ హోటల్ బయట ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్, శివకుమార్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలను అమృతహల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
‘నేను మధ్యప్రదేశ్ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిని. ఈనెల 26న ఎన్నికలు జరగనున్నాయి. మా ఎమ్మెల్యేలను ఇక్కడ దాచేశారు. వాళ్లు నాతో మాట్లాడాలనుకుంటున్నారు. వారి ఫోన్లను లాక్కున్నారు. పోలీసులు కూడా నన్ను వారితో మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారు. వాళ్లు వెనక్కు తిరిగి వస్తారని అనుకున్నాం. కానీ, వాళ్లను వెనక్కు రానీయటంలేదు. వారి కుటుంబసభ్యుల దగ్గరినుంచి సందేశాలు వస్తున్నాయి. నేను ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలతో మాట్లాడాను. వారిని నిర్భందంలో ఉంచారని చెప్పారు. సెల్ఫోన్లు దొంగలించారట. ప్రతి రూము దగ్గర పోలీసు బందోబస్తు ఉంది. ప్రతి నిమిషం వారి వెన్నంటే ఉంటున్నార’’ని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. అయినా సరే పోలీసులు వారిని అక్కడ నుంచి తరలించారు.