కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆర్ధిక మంత్రి
త్వరలోనే దేశ పారిశ్రామిక రంగానికి సంబంధించిన ప్యాకేజీ ప్రకటించనున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనికి సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకుందన్నారు. ఆమె మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. పలు కీలక అంశాలను వెల్లడించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలుకు చివరి తేదీని జూన్ 30 వరకూ పొడిగించారు. ప్రస్తుతం ఈ గడువు మార్చి 30 వరకూ ఉంది. పాన్, ఆధార్ అనుసంధాన డెడ్లైన్ను కూడా మార్చి 31 నుంచి జూన్ 30 వరకూ పొడిగించారు.
ఇక ఆదాయ వివరాల దాఖలుపై లేటు ఫీజును 12 శాతం నుంచి 9 శాతానికి తగ్గించామని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వివాద్ విశ్వాస్ స్కీమ్ గడువు కూడా జూన్ 30 వరకూ పెంచారు. రూ 5 కోట్ల లోపు టర్నోవర్ కలిగిన కంపెనీలకు జీస్టీ రిటర్న్స్ పై వడ్డీ, లేటు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. రూ 5 కోట్లకు మించిన టర్నోవర్ కలిగిన కంపెనీలకు లేటు ఫీజు ఉండదు..కానీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జీఎస్టీ, ప్రత్యక్ష పన్నులు, దివాలా చట్టం అమలుపై కొన్ని కీలక చర్యలు తీసుకుంటామని చెప్పారు. బ్యాంకింగ్, వాణిజ్యం, ఫిషరీస్, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామని అన్నారు.