కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన పలు కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రివర్గం బుధవారం నాడు తీసుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేశంలోని 80 కోట్ల మందికి ప్రత్యేక రేషన్ ద్వారా రూ 3 కే కిలో బియ్యం, రూ 2 కే కిలో గోధుమలు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేవర్ వెల్లడించారు. ప్రజలకు అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయని, పాలు నిత్యావసర దుకాణాలు నిర్ణీత సమయంలో తెరిచిఉంటాయని తెలిపారు. ప్రజలంతా క్రమశిక్షణతో మెలుగుతూ సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు.
కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో కార్మికులకు ఆయా సంస్థలు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. మహమ్మారికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా త్వరలో జిల్లాల వారీగా హెల్ప్ లైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలో నిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 14 వరకూ దేశమంతటా లాక్డౌన్ అమల్లో ఉండబోతుంది.