అసెంబ్లీ నుంచి కెటీఆర్ ఫార్మ్ హౌస్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రసంగానికి అడ్డుపడుతున్నారన్న కారణంతో అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఒక్క రోజుకే ఈ సస్పెన్షన్. సస్పెండ్ అయిన వారిలో భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనసూయ, జయప్రకాశ్ రెడ్డి, పోడెం వీరయ్యలు ఉన్నారు. సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యేలు కెటీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యత్నించారు. 111 జీవోను ఉల్లంఘించి కేటీఆర్ ఫాంహౌస్ కట్టారని ఆరోపిస్తూ.. పోలీసులతో భట్టి విక్రమార్క, సీతక్క వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు గండిపేట్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ ఫాంహౌస్ ను డ్రోన్ తో చిత్రీకరించారనే కారణంతో అరెస్ట్ అయిన చంచల్ గూడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెల్యేలు కూడా కెటీఆర్ ఫాంహౌస్ ముట్టడికి ప్రయత్నించారు. అంతకు ముందు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ కు సీఎం కెసీఆర్ సమాధానం చెబుతుండగా..కేసీఆర్ ప్రసంగాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడ్డుకున్నారు. కోమటిరెడ్డి తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని సీఎం కేసీఆర్ అన్నారు.
ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ అంతటివాళ్లే ఓడిపోయారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్కు కేవలం 4 శాతం ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు దిగజారిపోతోందని చెప్పారు. గొంతు ఉంది కదా అని అసత్య ఆరోపణలు చేయొద్దని సీఎం సూచించారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించామన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించినా కాంగ్రెస్కు బుద్ధిరాలేదని మండిపడ్డారు. ఆనాడు కరెంట్ ఛార్జీల రూపంలో భయంకర విపత్తు వచ్చిందని గుర్తుచేశారు. ప్రజల దయతోనే అధికారంలో ఉంటామన్నారు. అధికారమే పరమావధిగా ఉండకూడదన్నారు.