ఏపీ ఎస్ఈసీ కార్యాలయానికి కేంద్ర బలగాలతో భద్రత

ఏపీలో గతంలో ఎన్నడూ లేని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ సర్కారుకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేయటమే దీనికి కారణం అయింది. ఈ పరిణామాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన అనంతరం సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం, ఆ తర్వాత మంత్రులు..వైసీపీ నేతలు రమేష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో ఎటాక్ చేశారు. ఆ తర్వాత ఎస్ఈసీ రమేష్ కుమార్ కూడా కేంద్ర హోం శాఖకు ఘాటైన లేఖ రాశారు. అందులో పలు రాజకీయ అంశాలు కూడా ఉండటంపై అధికార వర్గాల్లో విస్మయం కూడా వ్యక్తం అవుతోంది. అయితే ఈ లేఖ నిజమా..కాదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో సీఎం జగన్ ఈ అంశంపై డీజీపీతోపాటు ఇంటెలిజెన్స్ చీఫ్ తో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ తరుణంలో ఎస్ఈసీ కార్యాలయం వద్ద సీఆర్ పీఎఫ్ బలగాలతో భద్రత కల్పించటం కీలక పరిణామంగా కన్పిస్తోంది. సీఆర్ పీఎఫ్ 39 బెటాలియన్ నుంచి బలగాలను పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
తనకు భద్రత కావాలని..తనతోపాటు తన కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ ఎస్ఈసీ బుధవారం నాడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. లేఖ వెళ్లిన మరుసటి రోజే సీఆర్ పీఎఫ్ బలగాలు ఎస్ ఈసీ కార్యాలయం వద్ద భద్రతకు వచ్చాయంటే కేంద్రం కూడా ఈ లేఖపై చాలా వేగంగా స్పందించినట్లేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతోపాటు ఆయన నివాసం వద్ద వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా పెంచినట్లు చెబుతున్నారు. రమేష్ కుమార్ కోరినట్లు ఎస్ఈసీ వద్ద సీఆర్ పీఎఫ్ బలగాలు మాత్రం రంగంలోకి దిగాయి. ఈ పరిణామాలపై ఏపీ సర్కారు ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. ఓ వైపు వైసీపీ నేతలు, కొంత మంది మంత్రులు అది నిజంగా రమేష్ కుమార్ రాసిందేనా? లేక ఫేక్ లెటరా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ లెటర్ అయితే సీఆర్ పీఎఫ్ బలగాలు వాటంతట అవే ఎలా వస్తాయన్నదే ఇప్పుడు ప్రశ్న. ఎస్ఈసీ కార్యాలయానికి సీఆర్ పీఎఫ్ బలగాలు వచ్చాయంటే లేఖ నిజమే అన్న విషయం స్పష్టం అవుతుందని...దీనికి ఇంత కంటే ఆధారాలు ఏమి కావాలని ఓ అధికారి వ్యాఖ్యానించారు.