Telugu Gateway
Andhra Pradesh

అమరావతి నుంచి కార్యాలయాల తరలింపునకు హైకోర్టు బ్రేక్

అమరావతి నుంచి కార్యాలయాల తరలింపునకు హైకోర్టు బ్రేక్
X

అమరావతి నుంచి రాజధానిని తరలించాలనే సన్నాహాల్లో ఉన్న ఏపీ సర్కారుకు హైకోర్టులో శుక్రవారం నాడు చుక్కెదురు అయింది. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి కర్నూలును న్యాయ రాజధానిని, విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించి..అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్ ను కొనసాగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. నేరుగా రాజధాని తరలింపులో భాగంగా అని సర్కారు చెప్పకపోయిన ఇటీవలే అమరావతి నుంచి విజిలెన్స్ కమిషనర్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ ,సభ్యుల ఆపీస్ లను వెలగపూడి నుంచి కర్నూలు తరలించడానికి ప్రభుత్వం జిఓ విడుదల చేసింది. దీనిపై తాళ్లాయపాలెంకు చెందిన గిరిదర్, అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి తిరుపతిరావు లు హైకోర్టులో పిటిషన్ లు వేశారు.

ఆ పిటిషన్ లపై విచారణ చేసిన ఛీప్ జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ జయసూర్యల తో కూడిన బెంచ్ ఆపీస్ ల తరలింపును నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం ఈ అంశంపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు జడ్జిమెంట్ ను రిజర్వ్ చేసి...శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్నట్లు సర్కారు తన వాదనలు విన్పించింది. దీంతోపాటు సచివాలయంలో ఈ కార్యాలయాలకు సరిపడినంత స్థలం కూడా లేదని తెలిపారు. అయితే అమరావతి రైతులు మాత్రం దురుద్దేశంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని కోర్టు ముందు తమ వాదనలు విన్పించారు.

Next Story
Share it