రమేష్ కుమార్ కు సీఎస్ లేఖ

కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేయాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంపై సర్కారు సీరియస్ గా ఉంది. ఈ అంశంపై సీఎం జగన్ ఇప్పటికే గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలసి ఫిర్యాదు చేశారు. అంతే కాదు..విలేకరుల సమావేశం పెట్టి మరీ రమేష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. తాజాగా సోమవారం నాడు మరో పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికలు వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఎస్ ఈసీ రమేష్ కుమార్ కు లేఖ రాశారు. ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా ఉందని..ఏపీలో కరోనా వైరస్ ప్రభావం కూడా పెద్దగాలేదని తెలిపారు. ఈ లేఖకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇఛ్చిన నివేదికను కూడా జతచేశారు. మరి ఇప్పుడు ఈ లేఖపై రమేష్ కుమార్ ఎలా స్పందిస్తారు? తాను తొలుత తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటారా? లేక మార్పులు, చేర్పులు చేస్తారా?అన్నది వేచిచూడాల్సిందే. అదే సమయంలో రమేష్ కుమార్ సోమవారం నాడు గవర్నర్ ను కలసి ఎన్నికల వాయిదాకు దారితీసిన పరిస్థితులను వివరించనున్నారు. నేరుగా సీఎం రంగంలోకి దిగి ఎన్నికల వాయిదాపై అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితా ముద్రణతో పాటు మిగతా కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయని సీఎస్ తన లేఖలో వివరించారు. ప్రజారోగ్యం బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిందని, కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలను చేపట్టిందని లేఖ ద్వారా ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ‘ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపివుంటే కరోనాపై వాస్తవ నివేదికను అందించేవాళ్ళం. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ప్రయాణికుడికి స్క్రీంనింగ్ చేసి, ఇంటింటికి వెళ్లి వైద్యసేవలు అందించే ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల పాలకవర్గాలు కీలక పాత్ర పోషిస్తాయి. కరోనా నియంత్రణ చర్యలకు స్థానిక సంస్థలు చాలా ఉపయోగపడతాయి. మరో 3, 4 వారాల్లో కరోనా రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ముందస్తుగా అవసరమైన చర్యలు తీసుకున్నాం. ఎన్నికల సంఘం తీసుకున్న ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి’ అని కోరారు.