చంద్రబాబు కోరుకున్నదే వైసీపీ చేసిందా?!

నాటి వైజాగ్ ఘటనకు నేడు ప్రతీకారం తీర్చుకున్నారా?
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కోరుకున్నదే వైసీపీ చేసిందా?. టీడీపీ ఏది ప్రచారం చేస్తుందో అది నిజం చేసేందుకు అధికార పార్టీ తన వంతు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేసినట్లు కన్పిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గురువారం నాడు వైజాగ్ లో జరిగిన పరిణామాలపై ఏపీలోని మిగిలిన 12 జిల్లాల స్పందన ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే వైజాగ్ ప్రజల స్పందనే అత్యంత కీలకం. విమానాశ్రయంలో మాత్రం గంటల తరబడి అధికార, వైసీపీ నేతల ఆందోళనల కారణంగా విమాన ప్రయాణికులతో పాటు ఈ రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ప్రజలకు చికాకులు ఏర్పడ్డాయి. చంద్రబాబు తన వైజాగ్ పర్యటనను ముందే ప్రకటించారు. టీడీపీ ఇప్పటికే ప్రశాంతంగా ఉన్న వైజాగ్ లో రాజధాని పేరు చెప్పి వైసీపీ నేతలు భూ కబ్జాలు చేస్తున్నారని..వైజాగ్ వాతావరణాన్ని చెడగొడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి పర్యటనను గంటల తరబడి వైసీపీ శ్రేణులు అడ్డుకోవటంతో టీడీపీ పొలిటికల్ ఎటాక్ వెంటనే ప్రారంభించింది. తాము ముందు నుంచి ఏది చెబుతున్నామో అదే నిజమని తేలిందని..చంద్రబాబు వైజాగ్ పర్యటనను అడ్డుకోవటం ద్వారా తమ వాదన నిజమైందనే ప్రచారాన్ని టీడీపీ నేతలు ప్రారంభించారు. తమ సహజమైన శైలిలో వైజాగ్ లో కూడా పులివెందుల రాజకీయాలు తెచ్చారనే తీవ్రమైన ఆరోపణలకు కూడా దిగారు.
చంద్రబాబు పర్యటన సాఫీగా సాగి ..ఆయన ఏమైనా ఆరోపణలు చేస్తే అధికారంలో ఉన్న పార్టీ కౌంటర్ ఇస్తుంది. చంద్రబాబు ఏదైనా విమర్శలు చేస్తే టీడీపీ స్టైల్ లోనే వైసీపీ నేతలు కూడా ఈ మధ్య మూకుమ్మడిగా రంగంలోకి దిగి కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. అధికార పార్టీ కనుక ఆ పార్టీ నేతలకు స్పేస్ కూడా దొరుకుతుంది. కానీ చంద్రబాబును అసలు విమానాశ్రయం నుంచి బయటకు రాకుండా అడ్డుకోవటం ద్వారా అటు ప్రభుత్వం, ఇటు వైసీపీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో సహజంగానే మీడియాలో ఈ అంశానికే ఫోకస్ ఎక్కువగా వస్తుంది. వైజాగ్ టీడీపీ ఎమ్మెల్యేలు ఏమి చెబుతున్నా కూడా చంద్రబాబు మాత్రం ఒకటే రాష్ట్రం..ఒకే రాజధాని అన్న నినాదానికే కట్టుబడి ఉన్నారు. వైసీపీ నేతలు మాత్రం వైజాగ్ వచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ వద్దని ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. అందుకే గో బ్యాక్ చంద్రబాబు అంటూ ఆయన పర్యటనను అడ్డుకున్నారు.
ఇక ఈ సీన్ కట్ చేస్తే అధికారంలో ఉండగా చంద్రబాబునాయుడు కూడా ఓ సారి ప్రత్యేక హోదా ఉద్యమం కోసం వైజాగ్ వెళ్ళిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని విమానాశ్రయంలోనే అడ్డుకుని అక్కడ నుంచే అటు హైదరాబాద్ పంపించేశారు. ఎందుకు అంటే ఆ రోజు చంద్రబాబుకు ప్రత్యేక హోదా ఉద్యమం ఇష్టం లేదు. జగన్ పర్యటనకు జనం బాగా వచ్చి అది కాస్తా హైలెట్ అయితే తన రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నది ఆ రోజు లెక్క. జగన్ ను అడ్డుకున్న తీరుపై టీడీపీ ప్రభుత్వం అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అధికారంలో ఉన్నారు కదా?. అయినా సరే డోంట్ కేర్ అన్నారు. ఇది పాత కధ. ఇప్పుడు జగన్ సర్కారు చంద్రబాబును అడ్డుకోవటం ద్వారా ‘బాకీ’ తీర్చుకున్నట్లు ఉంది. అయితే ఈ పరిణామాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచిచూడాల్సిందే.