ట్రంప్ పర్యటనపై వర్మ సంచలన వ్యాఖ్యలు
రాజకీయ నాయకులు ఏ దేశమైనా ఒకటేనేమో. అందుకు అగ్రరాజ్యాధినేత కూడా ఏ మాత్రం మినహాయింపు కాదనుకుంటా. ఎందుకంటే ఓ సారి తనను స్వాగతించేందుకు డెబ్బయి లక్షల మంది రావాలని..తర్వాత కోటి మంది రావాలని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. అయితే ఆ మాటలు మోడీయే తనకు చెప్పారని చెప్పటం విశేషం. తనకు కోటి మందితో స్వాగతం పలకాలని..అలా పలుకుతామని మోడీ చెప్పారని ట్రంప్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.
గత కొంత కాలంగా ఆయన మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ పై ట్వీట్ తో మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటో మీరే చూడండి. ‘ట్రంప్కు స్వాగతం పలకడానికి కోటి మంది రావాలంటే.. ఆయనతో పాటు స్టేజీపైన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అమిర్ ఖాన్, షారుక్ ఖాన్, సౌత్ స్టార్ రజనీకాంత్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనెలతో పాటు సన్నీ లియోన్ లను వరుసగా నిలబెడితే ఆయన అకున్నట్లు కోటిమంది వస్తారు’ అని ట్వీట్ చేశారు. ఈ నెల 24,25న భారత్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే.