ఇకనైనా చీకటి జీవోలు ఆపండి

అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం అర్ధరాత్రి జీవోలు జారీ చేయటం ఏమిటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ తీరు చూసి ఉన్నతాధికారులు కూడా అభద్రతా భావంతో పనిచేయాల్సి వస్తోందని అన్నారు. అర్ధరాత్రి జీవో 13ను జారీ చేయటం అంటే 151 సీట్లు ఇఛ్చిన ప్రజలు మోసం చేయటానికా, లేక హైకోర్టు కళ్ళు కప్పటానికి ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యల వల్ల బలైపోయేది జీవోలపై సంతకాలు చేసే అధికారులేనని అన్నారు.
విజిలెన్స్ ఆఫీసును కర్నూలుకు ఎందుకు తరలిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. జగన్ తీరుతో అత్యున్నత స్థాయి అధికారి ఒకరు సెలవుపై వెళ్లాలని చూస్తున్నారని పవన్ పేర్కొన్నారు.జీవో 13 జారీ రాజధాని తరలింపుపై దాఖలైన కేసుల పరిధిలోకి వస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారని తెలిపారు. ఈ జీవో హైకోర్టు ముందుకు వచ్చిందని తెలిపారు. ఇకనైనా వైసీపీ సర్కారు దొడ్డిదారి చీకటి జీవోలు ఆపాలని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.