కరోనా కు మందు కనిపెట్టొచ్చు..కానీ టీడీపీకి కష్టం

టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్కు మందు కనిపెటొచ్చు కానీ.. టీడీపీ నేతల నోళ్ళకు మందు కనిపెట్టలేము అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ వద్ద లభించిన రెండువేల కోట్లకు సంబంధించిన అన్ని నిజాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు. ఆదాయ పన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో రెండు వేల కోట్ల ఆర్ధిక లావాదేవీలు బయట పడ్డాయని, దొడ్డి దారిన ప్రజాధనాన్ని కాజేశారని ఆరోపించారు. నిజాలు బయటకు వస్తాయనే భయంతో టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. సోమవారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జోగి రమేష్ మాట్లాడారు. మండలి రద్దు ద్వారా లోకేష్ ఎమ్మెల్సీ పదవి పోతుందన్న అక్కసుతోనే ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తే రెండు వేల కోట్ల ఆర్ధిక లావాదేవీలు బయట పడ్డాయని అధికారులే తెలిపారు. దీనితో చంద్రబాబుకు సంబంధంలేకపోతే.. ఐటీ దాడులపై ఎందుకు నోరు మెదపడం లేదు. దొడ్డి దారిన సూట్కేస్ కంపెనీల ద్వారా నిధులు కాజేసారు. శ్రీనివాస్తో మాకు సంబంధం లేదన్న టీడీపీ నేతలు మళ్ళీ ఎందుకు మావాడు అంటున్నారు. శ్రీనివాస్ ఆ డబ్బు ఎక్కడి పంపించారో వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయి. దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలి.. సభ్యత సంస్కారం లేని వ్యక్తి ఉమా. ఏబీసీడీలు కూడా రాని బుద్ధ వెంకన్న కూడా ట్వీట్లు పెడుతున్నారు. చంద్రబాబు తాబేదారు పవన్ కల్యాణ్ అని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కానీ చంద్రబాబు తన కేసులు కోసం మోదీ కాళ్ళు పట్టుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. తాము బీసీలను మోసం చేశామని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. 4 లక్షల ఉద్యోగాల్లో 2.70 వేల ఉద్యోగాలు బీసీలకు వచ్చాయి. అధికారంలోకి రాగానే బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం. బలహీనవర్గాలకు పెద్దపీటవేశాం.’ అని తెలిపారు.