జగన్ పై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బిజెపి ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని..ఈ సంగతి జగన్మోహన్ రెడ్డి కి తెలుసని వ్యాఖ్యనించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సీఎం జగన్.. తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాయడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హోదా అనే వ్యవస్థే లేదని, అలాంటి లేని వ్యవస్థ కోసం మాట్లాడితే జగన్ రాజకీయంగా ఇబ్బంది పడతారని వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ ఏ రాష్ట్రానికి ఇవ్వనంతగా ఏపీకి కేంద్రం నిధులు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాకు బదులు ప్రాజెక్టుల కోసం రూ.22వేల కోట్లు అదనంగా కేంద్రం ఇచ్చిందన్నారు. ప్రత్యేక హోదాను పునరుద్ధరించే ఉద్దేశం కేంద్రానికి లేదని జీవీఎల్ మరోసారి స్పష్టం చేశారు.హోదాపై రాజకీయం చేయాలని చూస్తే గత ప్రభుత్వంలా అది వైసీపీ సర్కారు మెడకు చుట్టుకుంటుందని హెచ్చరించారు.
అమరావతి విషయంలో రాజకీయంగానే ఏపీ ప్రభుత్వంపై తమ పోరాటం ఉంటుందని అన్నారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని మరోసారి స్పష్టం చేశారు. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని.. రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధాని పెట్టుకోవచ్చని జీవీఎల్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పినా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జీవీఎల్ వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం అడ్డుకుంటోందని కొందరు భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని తాము స్పష్టంగా చెబుతున్నామన్నారు. 2015లో అప్పటి ప్రభుత్వం అమరావతిపై ఇఛ్చిన జీవోను ఇఫ్పటి ప్రభుత్వం మరో జీవోతో మార్చుకోవచ్చన్నారు. ఇదేమి పెద్ద విషయం కాదన్నారు.