చాక్లెట్ దొంగతనం చేశాడని దాడి..విద్యార్ధి మృతి
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ చాక్లెట్ దొంగతనం చేశాడనే కారణంతోనే ఇంటర్ విద్యార్ధిపై భద్రతా సిబ్బంది దాడి చేశారు. దీంతో కొద్దిసేపటికే అతను మృతి చెందాడు. ఈ వ్యవహారం నగరంలో కలకలం రేపింది. ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఎల్. సతీష్(17) వనస్థలిపురంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. వనస్థలిపురంలోని డీమార్ట్ లో షాపింగ్ చేయడానికి ఆదివారం తన స్నేహితులతో వెళ్లిన సతీష్కు సెక్యూరిటీతో గొడవ జరిగింది. డీమార్టులో చాక్లెట్ దొంగిలించాడని విద్యార్థిపై సిబ్బంది దాడికి దిగారు.
కాసేపటికి సతీష్ మరణించాడు. దీంతో సెక్యూరిటీ వారు దాడి చేయడం వల్లే తన కొడుకు మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హయత్నగర్లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో సతీష్ ఇంటర్ సెంకడ్ ఇయర్ చదువుతున్నాడు. తల్లిదండ్రుల అనుమతి లేకుండానే సతీష్ను కళాశాల యాజమాన్యం బయటకు పంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.