Telugu Gateway
Politics

నితీష్ కుమార్ పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

నితీష్ కుమార్ పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
X

ప్రశాంత్ కిషోర్. రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారెవరికైననా ఈ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేయటమే కాకుండా..బీహార్ కేంద్రంగా ఓ భారీ కార్యక్రమం ప్రకటించారు. దీని తర్వాత ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయనేది ఇఫ్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ కిషోర్ ఇంతకు ముందు చెప్పినట్లుగానే మంగళవారం నాడు మీడియా ముందుకు వచ్చారు. ఇందులో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘పార్టీ సిద్ధాంతం గురించి నేను, నితీశ్‌ జీతో చాలా చర్చలు జరిపాను. గాంధీజీ ఆశయాలను పార్టీ ఎన్నటికీ వీడదని ఆయన చెప్పారు. కానీ గాంధీజీని హతమార్చిన నాథూరాం గాడ్సేకు అనుకూలంగా నేడు వారు మాట్లాడుతున్నారు. అయితే నాకు తెలిసినంత వరకు గాంధీ- గాడ్సే చేతులు పట్టుకుని ఉండరు కదా’’ అంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు. బీహార్‌ యువత బలమైన నాయకత్వాన్ని కోరుకుంటోందని అన్నారు.

అందుకే వేలాది మంది యువతతో రాజకీయ శక్తిని తయారుచేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు 100 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటిస్తానని చెప్పారు. ఈ మేరకు ‘బాత్‌ బీహార్‌ కీ’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కోటి మంది యువత అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ఫిబ్రవరి 20 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ వేడిని మరింత పెంచాయి. తనను పార్టీ నుంచి బహిష్కరించినందుకు జనతాదళ్‌ చీఫ్‌, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను ప్రశ్నించబోనని స్పష్టం చేశారు. తనకు నితీశ్‌తో సత్సంబంధాలే ఉన్నాయని.. ఆయన మీద అపారమైన గౌరవం కూడా ఉందని పేర్కొన్నారు.

అదే సమయంలో.. ‘‘నిజానికి ఘట్‌బంధన్‌ వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఎంతగా తల వంచినప్పటికీ.. పరిస్థితిలో మార్పురావడం లేదు. గత పదిహేనేళ్లుగా నితీశ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం చూశాం. కానీ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది తక్కువే. పైగా ఆయన కొత్త స్నేహాలు ఇప్పుడు రాష్ట్రానికి ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు. మహారాష్ట్ర, కర్ణాటకలతో పోలిస్తే బీహార్‌ ఇప్పుడు ఎక్కడ ఉంది’’ అని ప్రశ్నించారు. ‘‘నేనెక్కడికీ వెళ్లడం లేదు. ఇక్కడే ఉంటాను. బీహార్‌ కోసం పనిచేస్తాను. బీహార్‌ అభివృద్ధిని కోరుకునే వారు నాతో కలిసి రావచ్చు. రాష్ట్రాన్ని బలోపేతం చేయడానికి ‘బాత్‌ బీహార్‌ కీ’లో పాల్గొనండి’’ అని పిలుపునిచ్చారు.

Next Story
Share it