ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళతారు. జగన్ తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీతోపాటు హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను కలుసుకునే అవకాశం ఉందని సమాచారం. జగన్మోహన్ రెడ్డి రాజదాని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంత వరకూ ఢిల్లీ వెళ్ళలేదు.
ప్రధానితో భేటీ సందర్భంగా రాజధానుల అంశంతోపాటు మండలి రద్దు త్వరగా జరిగేలా చూడటం, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై సత్వరమే నిర్ణయం తీసుకోనేలా కేంద్రానికి జగన్ వినతిపత్రాలు ఇఛ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పోలవరం పనులకు సంబంధించి లెక్కల తనిఖీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్తగా నిధులు మంజూరు చేస్తామని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. ఇది రాష్ట్రానికి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.