Telugu Gateway
Andhra Pradesh

ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ కు కేబినెట్ ఆమోదం

ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ కు కేబినెట్ ఆమోదం
X

స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్ బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం లభించనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. మార్చి15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 15 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చట్టంలో మార్పులు తీసుకువస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డబ్బు, మద్యం ప్రమేయం లేకుండా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అక్రమాలకు పాల్పడే వారిపై అనర్హత వేటు వేస్తామని… గరిష్టంగా మూడేళ్ళ వరకు జైలు శిక్ష కూడా పడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రచారానికి 5 రోజులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి 8 రోజులు గడువును విధించామని మంత్రి తెలిపారు. సర్పంచ్‌లు స్థానికంగా నివాసం ఉండేలా నిబంధనలు తీసుకువస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో సర్పంచ్‌, ఎంపీపీ, జెడ్పీటీసీ ఎస్టీలకే కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టినట్లు తేలితే అనర్హత వేటు పడనుంది. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్, ఏపీ స్టేట్ ఫైనాన్సియల్ లిమిటెడ్ ఏర్పాటుకు కాబినెట్ ఆమోదం తెలిపిందని పేర్ని నాని వెల్లడించారు. జెన్ కో ఆధ్వరంలో 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు.

Next Story
Share it