Telugu Gateway
Politics

బాగ్దాద్ విమానాశ్రయంపై అమెరికా రాకెట్ దాడులు

బాగ్దాద్ విమానాశ్రయంపై అమెరికా రాకెట్ దాడులు
X

ఇరాక్ లోని బాగ్దాద్ విమానాశ్రయంలో శుక్రవారం తెల్లవారు జామున కలకలం. వరస పెట్టి జరిగిన రాకెట్ దాడులతో ఆ ప్రాంతంలో ఏమి జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. అమెరికానే ఈ దాడులకు పాల్పడినట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా అంతర్జాతీయంగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్‌ కార్గో టెర్మినల్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దాడి చోటుచేసుకుంది. రాకెట్ దాడుల ఘటనలో రెండు కార్లు ధ్వంసం కాగా, 8 మంది మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇరాన్‌, ఇరాక్‌కు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు ఉన్నట్టు ఇరాక్‌ మీడియా పేర్కొంది. ఇరాన్‌ క్వాడ్స్‌ ఫోర్స్‌ అధిపతి జనరల్‌ ఖాసీం సోలెమన్‌, ఇరాక్‌ మిలీషియా కమాండర్‌ అబూ మహదీ అల్‌ ముహండిస్‌ మృతిచెందినట్టు ఇరాక్‌ మిలీషియా ప్రతినిధి వెల్లడించారు.

ఈ దాడికి పాల్పడింది అమెరికా బలగాలే అని ఇరాక్‌ పీఎంఎఫ్‌ ప్రతినిధి అహ్మద్ అల్ అస్సాది ఆరోపించారు. దీనిపై యూఎస్‌ అధికారులు స్పందిస్తూ.. బాగ్దాద్‌లో ఇరాన్‌తో ముడిపడి ఉన్న రెండు లక్ష్యాలపై దాడి జరిగినట్టు తెలిపారు. మూడు రాకెట్లతో బాగ్దాద్‌ విమానాశ్రయంపై దాడి జరిగిందని ఇరాక్‌ పారా మిలటరీ గ్రూప్స్‌ తెలిపాయి. ఈ దాడిలో ఇరాక్‌ పారా మిలటరీకి చెందిన ఆరుగురు సభ్యులు, ఇద్దరు అతిథులు ఉన్నట్టు వారు పేర్కొన్నారు. ఇటీవల ఇరాన్‌ అనుకూల మిలీషియా సభ్యులు, పలువురు నిరసనకారులు బాగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన అమెరికా.. ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. ఈ క్రమంలోనే బాగ్దాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పై రాకెట్‌ దాడులకు పాల్పడింది.

Next Story
Share it