Telugu Gateway
Politics

కెటీఆర్ అవినీతిపై సమగ్ర విచారణ..రేవంత్ రెడ్డి లేఖ

కెటీఆర్ అవినీతిపై సమగ్ర విచారణ..రేవంత్  రెడ్డి లేఖ
X

తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ పై మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కెసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. అందులో తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. కేటీఆర్ అవినీతి పై సమగ్ర విచారణకు ఆదేశించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. 111 జీవో పరిధిలో బినామీ పేరుతో రాజమహల్ కట్టుకున్నారని ఆరోపించారు. ‘రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి జీవో 111 సమీక్షిస్తామంటున్నారు. 111 జీవో పరిధి నుంచి కొన్ని గ్రామాలు మినహాయింపు ఆలోచన వెనుక కుట్ర ఉంది. పుప్పాల గూడాలో రూ.30 కోట్ల విలువ చేసే ఆస్తి రూ. కోటికే ఎలా కొన్నారు?. 2014లో రూ.8 కోట్లు ఉన్న కేటీఆర్ ఆస్తి... 2018కి రూ.41 కోట్లకు పెరగడం వెనుక రహస్యం ఏమిటి?. టీఆర్ఎస్ విరాళాలు రూ.188 కోట్లకు పెరగడం వెనుక రాజకోట రహస్యం ఏమిటి?.

రాష్ట్రం రూ.3 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే... మీరు మాత్రం వేల కోట్లకు అధిపతులయ్యారు. త్యాగాల తెలంగాణలో భోగాలు అనుభవిస్తున్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు... ఉద్యమాల తెలంగాణను మీరు చెరబట్టారు. గచ్చిబౌలి, కోకాపేటల్లో వందల ఎకరాలు ఎలా సొంతమయ్యాయి? మీరు విచారణకు ఆదేశించకుంటే కోర్టును ఆశ్రయిస్తాం. మీ అవినీతి బాగోతాల పై త్వరలో సమగ్ర వివరాలు, ఆధారాలతో పుస్తకం వేస్తాం’ అని తెలిపారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్ రెడ్డి కెటీఆర్ అవినీతి గురించి ప్రస్తావించారు. అవినీతి ఎలా చేయాలో కెసీఆర్ కంటే కెటీఆర్ కే బాగా తెలుసంటూ వ్యాఖ్యానించారు. కెటీఆర్ అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలను మునిసిపల్ ఎన్నికల తర్వాత బహిర్గతం చేయనున్నట్లు తెలిపారు.

Next Story
Share it