ప్రజలను మభ్యపెట్టడం కెసీఆర్ నుంచే నేర్చుకోవాలి
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలనే విషయం కేసీఆర్ను చూసి నేర్చుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలు కేసీఆర్ వైపే ఎందుకు నిలబడుతున్నారనేది కాంగ్రెస్ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయన ఆదివారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డిలో తాము ఓడిపోవడం మంచిదేనన్నారు. గెలిస్తే తమ పార్టీ వాళ్లు మున్సిపల్ చైర్మన్గా ఏ పనీ చేయలేకపోయేవాళ్లమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్ గట్టి పోటీనిచ్చిందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి అనే చర్చే రాలేదని.. కేవలం డబ్బు ప్రభావమే ఉందన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చిత్తశుద్ధితో అధికార పార్టీపై పోరాడారని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు పెద్ద గొప్ప కాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ‘అధికారంలో ఉన్న పార్టీకి అంగబలం, అర్థబలం అన్నీ ఉంటాయి. కాబట్టి కాబట్టి వాళ్లకు గెలుపు అవకాశాలు ఎక్కువ. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ డబ్బు ప్రభావంతో గెలిచింది. మా దగ్గర డబ్బు లేదు, కాబట్టి వెనుకబడ్డాం. అంతమాత్రాన కాంగ్రెస్కు ప్రజాదరణ లేదనుకుంటే పొరపాటే. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు 5, 10 ఓట్ల తేడాతో ఓడిపోయారు అని తెలిపారు. సంగారెడ్డి కాంగ్రెస్కు కంచుకోట. అలాంటి చోట టీఆర్ఎస్ జెండా ఎగరేసిన మంత్రి హరీష్ రావును అభినందిస్తున్నాను అని తెలిపారు.