Telugu Gateway
Cinema

చిరంజీవి, రాజశేఖర్ ల మధ్య వాగ్వాదం

చిరంజీవి, రాజశేఖర్ ల మధ్య వాగ్వాదం
X

‘మా’ డైరీ ఆవిష్కరణలో రగడ

మూవీ అర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణలో రగడ నడిచింది. గత కొన్ని రోజులుగా మా కమిటీలో తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. గత కొంత కాలంగా అవి సద్దుమణిగినట్లు కన్పించినా తాజాగా డైరీ ఆవిష్కరణ సందర్భంగా మరోసారి అవి బహిర్గతం అయింది. ఈ డైరీ ఆవిష్కరణకు ముఖ్య అతిధిగా చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ మాలో మంచి ఉంటే మైకులో చెబుదాం..చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం అని వ్యాఖ్యానించారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మరో హీరో రాజశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే కాకుండా నిప్పును కప్పుపెట్టినా పొగ రాకుండా మానదు అంటూ రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా అసోసియేషన్ లో విభేదాలు దాచేస్తే దాగవని అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ నుంచి రాజశేఖర్ మైకు లాక్కుని మాట్లాడారు. దీనిపై చిరంజీవి అభ్యంతరం వ్యక్తం చేశారు.

తన మాట విననప్పుడు తాను ఇక్కడ ఎందుకు ఉండాలంటూ రాజశేఖర్ ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. మా లో గొడవల వల్లే తన కుటుంబంలో విభేదాలు వచ్చాయని..తన కారు ప్రమాదానికి కూడా అదే కారణం అని వ్యాఖ్యానించారు. రాజశేఖర్ తీరును మరో సీనియర్ హీరో మోహన్ బాబు కూడా తప్పుపట్టారు. అయితే రాజశేఖర్ చేసిన గొడవపై చిరంజీవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందే ప్లాన్ చేసుకుని గొడవ చేయటానికే కొంత మంది వచ్చినట్లు ఉందని చిరంజీవి ఆరోపించారు. రాజశేఖర్ కావాలనే వివాదం సృష్టిస్తున్నారని అన్నారు. దీంతో చిరంజీవి, రాజశేఖర్ ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారంపై చిరంజీవి కూడా తీవ్రంగా స్పందించారు. పెద్దల మాటకు విలువ ఇవ్వనప్పుడు తమను ఎందుకు పిలవాలి అని అభ్యంతరం వ్యక్తం చేశారు. నరేష్ చేసిన తప్పులపై ఎందుకు మౌనంగా ఉన్నారని రాజశేఖర్ ప్రశ్నించారు.

Next Story
Share it