Telugu Gateway
Politics

తెలంగాణకు ఏమి చేశారని బిజెపిని నిలదీయండి

తెలంగాణకు ఏమి చేశారని బిజెపిని నిలదీయండి
X

మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ముఖ్యంగా బిజెపిని టార్గెట్ చేశారు. ఓట్లు అడగటానికి వస్తే రాష్ట్రానికి ఏమి చేశారని ఆ పార్టీ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. నీతి అయోగ్ సిఫారసులు చేసినా తెలంగాణ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్రమోడీ నిధులు విడుదల చేయాలేదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. శనివారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కేటీఆర్‌ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాజకీయంగా సిరిసిల్ల నాకు జన్మనిచ్చిందని, ఇక్కడి ప్రజలు పెట్టినభిక్ష వల్లే రాజకీయంగా ఎంతో ఎదిగానని కేటీఆర్‌ పేర్కొన్నారు. 70ఏళ్ల నుంచి కాంగ్రెస్, టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు పాలించాయి. రాజన్న భక్తులు సౌకర్యాల పట్ల కనీస ఆలోచన చేయలేదు.

చరిత్రలోనే మొదటి సారిగా రూ.220కోట్లతో వేములవాడ లోఅభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. వేములవాడకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే నాలుగు సార్లు వచ్చి అభివృద్ధిపై చర్చించారు. సిరిసిల్ల అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఉరిశాలగా చూసేవారు. ఇప్పుడు సిరిసిల్ల సిరిశాలగా మార్చాను. ఇంత అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ కాకుండా ఇంకెవరికైనా ఓటు అడిగే హక్కు ఉందా. మేం పెట్టిన అభ్యర్థులను ప్రత్యుర్థులు ఓడిస్తామంటే ఊరుకుంటామా. సిరిసిల్లను రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అగ్రశ్రేణి పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఒక్క పేదవాడు లేకుండా వారికి ఇళ్ళు ఇచ్చే బాధ్యత నాది. జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాల తీసుకువస్తున్నాం. తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలను దేశం గర్వించేలా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

Next Story
Share it