సీఏఏపై కేరళ కీలక నిర్ణయం
పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ) అంశంపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు పార్టీలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే..అధికార బిజెపి మాత్రం సీఏఏ విషయంలో ఏ మాత్రం రాజీపడేదిలేదని ప్రకటిస్తోంది. ఎన్ఆన్ సీ పై మాత్రం ప్రస్తుతానికి బిజెపి వెనక్కి తగ్గింది. తాజాగా కేరళ సీఏఏపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగం కల్పించిన హక్కులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని సవరించిందని తన పిటిషన్లో పేర్కొంది. రాజ్యాంగంలోని 14, 21, 24 అధికారణలకు ఈ చట్టం తీవ్ర విఘాతం కలిగిస్తోందని సుప్రీం దృష్టికి తీసుకెళ్లింది. దేశ లౌకికత్వాన్ని దెబ్బతీసే విధంగా చట్టం ఉందంటూ పేర్కొంది. ఈ మేరకు సీఏఏ చట్టాన్ని సవాలు చేస్తూ సోమవారం పిటిషన్ దాఖలు చేసింది.
ఈ విధంగా సుప్రీంను ఆశ్రయించిన తొలి రాష్ట్ర ప్రభుత్వంగా కేరళ నిలిచింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సీఏఏ, ఎన్ఆర్సీలపై ఇప్పటికే ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. బీజేపీయేతర ముఖ్యమంత్రులకూ విజయన్ ఈ అంశంపై లేఖలు రాశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు వివాదాస్పద చట్టాలను వ్యతిరేకించాలని ఆయన కోరారు. అలాగే అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం కూడా చేయాలని సూచించారు. సీఏఏకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇలా తీర్మానించిన తొలి రాష్ట్రంగా కూడా కేరళనే.