Telugu Gateway
Politics

కెటీఆర్ ఇప్పుడేమి చెబుతారు

కెటీఆర్ ఇప్పుడేమి చెబుతారు
X

మునిసిపల్ ఎన్నికల్లో బిజెపి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయినా కూడా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె. లక్ష్మణ్ టీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. ముఖ్యంగా ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ పై విమర్శలు సంధించారు. మున్సిపల్ ఎన్నికల కేటీఆర్‌కు చెంపపెట్టు వ్యాఖ్యానించారు. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో టీఆర్ఎస్ రెబల్స్ గెలవటం సిగ్గుచేటు అని అన్నారు. ఏకపక్షంగా మున్సిపాలిటీలను గెలుస్తామన్న కేటీఆర్ ఇప్పుడేమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ లేనేలేదన్న కేటీఆర్.. గద్వాల, నిజామాబాద్, భైంసా వెళ్లి చూస్తే బీజేపీ ఎక్కడుందో తెలుస్తుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌ను ఎదుర్కొని బీజేపీ నిలిచిందన్నారు.

పార్లమెంట్ ఎన్నికల కంటే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించిందని అన్నారు. మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో నాలుగు వార్డులు గెలిచామని అన్నారు. ఇంట గెలవని కేటీఆర్ రచ్చ గెలవటం కల అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఒంటరిగా 85 శాతం స్థానాల్లో పోటీ చేయటమే తమ మొదటి విజయం అని పేర్కొన్నారు. తెలంగాణలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్నామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీ భవిష్యత్‌కు నాంది అని పేర్కొన్నారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం అని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.

Next Story
Share it