Telugu Gateway
Andhra Pradesh

నారా లోకేష్ తీరుపై ‘టీడీపీ’లో నిరసనలు!

నారా లోకేష్ తీరుపై ‘టీడీపీ’లో నిరసనలు!
X

ఫ్యామిలీ ఫంక్షన్ లా పార్టీ కార్యక్రమంలో పూజలు

నారా లోకేష్ తీరుపై తెలుగుదేశం పార్టీలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ అంటే అదేదో తమ ప్రైవేట్ వ్యవహారంగా లోకేష్ తీరు ఉందని పలువురు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సహజంగా ఏ ఆఫీస్ లో ప్రవేశించేటప్పుడు అయినా..కార్యాలయంలోకి వెళ్లేటప్పుడు అయినా ఒక్కసారే పూజ చేస్తారు. ఇది సహజం. కానీ అధికారంలో ఉండగా చంద్రబాబునాయుడు రాజధాని అమరావతి విషయంలో ఓ సారి ఫ్యామిలీ ఫంక్షన్ గా కుటుంబ సభ్యులతో శంకుస్థాపన చేశారు. తర్వాత ప్రధాని మోడీని ఆహ్వానించారు. అది పాత సంగతి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అమరావతిలో పెద్ద ఎత్తున టీడీపీ జాతీయ కార్యాలయం ఏర్పాటు చేసింది. దీనికి శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలతోపాటు పార్టీ సీనియర్ నేతలు..కార్యకర్తలను ఆహ్వానించారు. ఇందులో ఎలాంటి పేచీ లేదు. అయితే టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇదే టీడీపీ కార్యాలయంలో గురువారం నాడే పూజలు నిర్వహించారు.

ఇది పూర్తిగా ఫ్యామిలీ కార్యక్రమంగా నిర్వహించారే తప్ప పార్టీలో నేతలెవరినీ ఆహ్వానించలేదు. ఈ పూజా కార్యక్రమంలో నారా లోకేష్, ఆయన భార్య నారాబ్రాహ్మణీ, దేవాన్ష్ లు, కార్యాలయ సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. ఓ వైపు చంద్రబాబునాయుడు అధికారికంగా శుక్రవారం నాడు కార్యాలయం ప్రారంభిస్తుంటే నారా లోకేష్ ముందు రోజు పూజ చేయటం..దీనికి పార్టీ నేతలు ఎవరినీ ఆహ్వానించకపోవటంతో టీడీపీ నేతల్లో చర్చ సాగుతోంది. ఈ కారణంగానే కొంత మంది నేతలు శుక్రవారం నాడు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించారు. మొత్తం మీద మరో సారి నారా లోకేష్ తీరు పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Next Story
Share it