‘మూడు రాజధానుల’పై ఏపీ సర్కారు దూకుడు
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై సర్కారు యమా స్పీడ్ గా వెళుతోంది. ఇంకా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజె) నివేదిక రానే లేదు..ఏపీ సర్కారు మాత్రం కేబినెట్ లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జీఎన్ రావు కమిటీ సిఫారసులతోపాటు..బీసీజె గ్రూప్ అధ్యయనాలను పరిశీలించి ప్రభుత్వానికి మూడు రాజధానుల వ్యవహారంపై సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఈ సిఫారసులను కేబినెట్ లో..ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టి ఆమోదించనున్నారు. ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేయటానికి ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించింది.
పది మంది మంత్రులు, అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు ఇతర నివేదికలను ఈ హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ కమిటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్రెడ్డి, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సభ్యులుగా ఉన్నారు. మూడు వారాల్లోగా ఈ కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందచేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అంటే జనవరి నెలాఖరు నాటికి ఏపీ రాజదానుల విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.