మరి ప్రతి రేపిస్ట్ నూ ఇలాగే చేస్తారా?
ప్రతి రేపిస్ట్ కూ ఇదే శిక్ష వేస్తారా? సమాజంలో వారి హోదాతో సంబంధం లేకుండా ఇలాగే వ్యవహరిస్తారా? అని ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ప్రశ్నించారు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అని ఆమె పేర్కొన్నారు. దిశ రేప్ కేసు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఎవరైతే సమాజం పట్ల బాధ్యత లేకుండా హత్యాచార ఘటనలకు పాల్పడతారో వారికే ఇదే సరైన శిక్ష అని అన్నారు. ఇకనైనా అత్యాచార ఘటనలకు ముగింపు దొరుకుతుందా? అని సందేహాలు వ్యక్తం చేశారు. అయితే మొత్తం మీద దిశ హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది.
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సైతం ఈ అంశంపై స్పందించారు. ‘ గ్రేట్ వర్క్ హైదరాబాద్ పోలీసు. వుయ్ సెల్యూట్ యు’ అని సోషల్ మీడియాలో కొనియాడారు. ఇక కేంద్ర మాజీ మంత్రి, ఏథెన్స్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత రాజ్యవర్థన్సింగ్ రాథోడ్ కూడా హైదరాబాద్ పోలీసుల్ని ప్రశంసించారు. ‘హైదరాబాద్ పోలీసులకు ఇవే నా అభినందనలు. పోలీస్ పవర్ను, నాయకత్వాన్ని చూపెట్టారు. చెడుపై మంచి సాధించిన విజయం అని దేశ ప్రజలు తెలుసుకోవాలి’ రాథోడ్ పేర్కొన్నారు.