Telugu Gateway
Politics

ఉన్నావ్ రేప్ కేసు.. ఎమ్మెల్యే దోషే

ఉన్నావ్ రేప్ కేసు.. ఎమ్మెల్యే దోషే
X

దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ ఉదంతంలో ఢిల్లీ హైకోర్టు సోమవారం నాడు కీలక తీర్పు వెలువరించింది. ఈ రేప్ నిందితుడు బిజెపి ఎమ్మెల్యే కావటం విశేషం. ఆయనపై రేప్ ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా బిజెపి చాలా కాలం పాటు ఆయన్ను పార్టీ నుంచి తప్పించలేదు. కానీ విమర్శల జోరు పెరగటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. ఆ తర్వాత కూడా ఉన్నావ్ అత్యాచార కేసులో జరిగిన పలు పరిణామాలు దేశ వ్యాప్తంగా పెద్ద ఫోకస్ అంశంగా మారింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడుగా ఉన్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ సెంగార్‌ను ఢిల్లీలోని తీస్ హాజారి కోర్టు దోషిగా తేల్చింది. కేసుపై సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం సోమవారం తీర్పును వెలువరించింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై కేసును విచారించిన ధర్మాసనం ఐపీసీ 376 అత్యాచారం కింద అతన్ని దోషిగా తేల్చింది. ఈ నెల 19న శిక్షను ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.

తనను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేశారని కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌పై ఓ మైనర్‌ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే బాలిక తండ్రి పోలీసు కష్టడీలోనే అనుమానస్పద రీతిలో మరణించారు. రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసుకు సంబంధించి రహస్య విచారణ చేపట్టారు. సీబీఐ వాదనలు పూర్తయిన తర్వాత హైకోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. బీజేపీకి చెందిన కుల్దీప్‌ సింగ్‌ ఉన్నావ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి న్యాయమూర్తి ధర్మేశ్‌ శర్మ ఈ కేసుపై రోజువారీ విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు చొరవతో ఈ కేసు లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ అయింది. 2017లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ ఓ బాలికను కిడ్నాప్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి శశిసింగ్‌ అనే వ్యక్తిపై అభియోగాలు నమోదయ్యాయి.

రెండేళ్ల తర్వాత ఈ ఏడాది ఆగస్టు 9న ఎమ్మెల్యేపై కూడా అభియోగాలు నమోదు కాగా బీజేపీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. నేరపూరిత కుట్ర (120బీ), కిడ్నాప్‌ (363), పెళ్లికి బలవంత పెట్టడం (366), అత్యాచారం (376) తదితర అంశాలతోపాటు లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే చట్టం(పోక్సో) కింద ఆ ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. అభియోగాల నమోదుకు సుమారు పది రోజుల ముందు అత్యాచార బాధితురాలు ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ట్రాక్టర్‌ ఢీకొనడంతో బాధితురాలి సన్నిహిత బంధువులు ఈ ప్రమాదంలో మరణించారు. బాధితురాలి తండ్రిపై ఉత్తరప్రదేశ్‌లో ఓ హత్య కేసు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఈ కేసును ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. విచారణ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేయాలని అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ ఆదేశాలు జారీ చేశారు.

Next Story
Share it