Telugu Gateway
Andhra Pradesh

అమరావతి రైతుల అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం

అమరావతి రైతుల అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం
X

అమరావతిలో రైతుల అర్ధరాత్రి అరెస్ట్ లను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు సర్కారు చేసే న్యాయం ఇదేనా? అని ప్రశ్నించారు. రైతులపై హత్యాయత్నం అభియోగాలు పెట్టడాన్ని ఖండించారు. రైతుబిడ్డలైన పోలీసులు రైతుల పట్ల సానుభూతిగా ఉండాలన్నారు.భూములు కోల్పోయి, రాజధానిపై ఆందోళనలో ఉన్నవాళ్లపై పోలీసు కేసులా..? నిద్రాహారాలు మాని ఆందోళన చేసే రైతులపై పోలీసు దాడులు హేయం.

దొంగలు, గుండాల మాదిరిగా భూములిచ్చిన రైతులపై దాడులా. జరిగిన సంఘటనకు పోలీసులు పెట్టిన సెక్షన్లకు పొంతన ఉందా. రాజధానికి భూములిచ్చిన రైతులను జైలు పాలు చేస్తారా. అర్ధరాత్రి ఇళ్ల గోడలు దూకి రైతులను అరెస్ట్ చేస్తారా.

మహిళలు, వృద్దులను భయభ్రాంతులను చేస్తారా. ఆరుగురు రైతులపై ఏడు సెక్షన్లు నమోదు చేస్తారా..? అర్ధరాత్రి హడావుడిగా జైలుకు తరలిస్తారా. రాష్ట్రం కోసం భూములు త్యాగాలు చేసిన రైతులపై ఇంత అమానుషమా. 33వేల ఎకరాలు అందజేసిన రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ లు అంటారా? 13రోజులుగా వేలాది రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా పట్టించుకోరా.

వెంకటపాలెం,నెక్కల్లు,మోదుగ లంకపాలెం,వెలగపూడికి చెందిన ఆరుగురు రైతుల అరెస్ట్ అప్రజాస్వామికం. వేలాది పోలీసులను దించి రైతుల ఆందోళనలను అణిచేయలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రైతుల అరెస్ట్ ల అంశంపై చర్చించారు.

Next Story
Share it