కేంద్రంపై కెటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కెటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం దక్షిణాదిపై చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం ఇతర రాష్ర్టాలకు ప్రాజెక్టులను తరలిస్తోందని ఆరోపించారు. ఐదేళ్లలో నలుగురు రక్షణ శాఖ మంత్రులను కలిసి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేయాలని కోరినా ఇంత వరకూ స్పందన లేదన్నారు. హైదరాబాద్ - బెంగళూరు హైవే మార్గంలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రంతో మాట్లాడాం. నాగ్ పూర్, గుజరాత్, చెన్నైలను మాత్రమే కేంద్రం పట్టించుకుంటోంది. డిఫెన్స్, ఏరోస్పేస్ విభాగాల్లో కొన్నింటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనం ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి అని కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ లో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన డిఫెన్స్ కాంక్లేవ్ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సమావేశంలో క్వాలిటీ స్టాండర్డ్స్ ఇన్ ఏరోస్పేస్ అండ్ ఢిపెన్స్పై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. డిఫెన్స్ కు అనుకూలంగా తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. కానీ కేంద్రం నుంచి సరైన సహకారం అందటం లేదన్నారు. రాష్ట్రానికి న్యాయబద్దంగా అందాల్సిన ప్రాజెక్టులు కూడా అందటంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏరోస్పేస్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామని కెటీఆర్ తెలిపారు.