Telugu Gateway
Andhra Pradesh

కీలక బిల్లుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

కీలక బిల్లుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
X

ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చట్ట సవరణ చేసింది. ఈ మేరకు చట్టంలో మార్పులు చేస్తూ ఏపీ కేబినెట్ బుధవారం నాడు నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్‌ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్‌ అనుమతి తెలిపింది. ఏపీ దిశ యాక్ట్‌ గా ఈ చట్టానికి నామకరణం చేశారు. ఇందులో భాగంగా భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 354కు సవరణలు చేసి కొత్తగా 354-ఈ చేర్చింది. ఈ చట్టం ద్వారా అత్యాచారానికి పాల్పడిన ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెలువడనుంది. వారం రోజుల్లోగా విచారణ పూర్తిచేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి రెండు వారాల్లోగా ట్రయల్ పూర్తి చేసి శిక్ష పడేలా చేయడం ఈ చట్టం ఉద్దేశంగా చెబుతున్నారు. రెడ్ హ్యాండెడ్‌గా ఆధారాలుంటే నిందితులకు మూడు వారాల్లోగా ఉరిశిక్ష విధించడానికి ఈ చట్టం దోహదం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందించారు.

అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాలకు సత్వరమే విచారణ చేసేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనుంది. సోషల్‌ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టింగ్‌లు పెడితే సెక్షన్‌ 354-ఈ కింద చర్యలు తీసుకునేలా ఈ బిల్లును ప్రతిపాదించారు. సోషల్‌ మీడియాలో మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. మహిళలను కించపరుస్తూ మొదటిసారి పోస్టు చేస్తే రెండేళ్లు, రెండోసారికూడా అదేవిధంగా పోస్టులు చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధించనున్నారు. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడితే 354 (ఎఫ్‌) కింద అయిదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలుశిక్ష పడనుంది. పోక్సో చట్టం కింద ఇప్పటివరకూ మూడేళ్ల నుంచి అయిదేళ్ల వరకూ జైలుశిక్ష విధిస్తున్న విషయం తెలిసిందే. ఆ శిక్షను పెంచుతూ ఈ బిల్లులో అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో సభ ఆమోదం పొందనుంది.

Next Story
Share it